నేను శైలజా’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘రెడ్’ వంటి చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు కిషోర్ తిరుమల. శర్వానంద్ హీరోగా ఆయన రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. రష్మిక మందన్న నాయికగా నటిస్తున్నది. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సకుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను బుధవారం జరిగిన కార్యక్రమంలో తెలిపారు దర్శకుడు కిషోర్ తిరుమల.
వెంకటేష్ తో చేయాల్సిన సినిమా కాదు
హీరో వెంకటేష్తో చేద్దామనుకున్న సినిమా ఇది కాదు. ఆయనకు మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథ వినిపించాను. హీరో పాత్ర ఒకేలా ఉంటుంది కానీ ఈ కథ భిన్నమైనది. ఇంట్లో, బయటా మన చుట్టూ ఉన్న మహిళలు మనకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. మన జీవితాలకు మంచి చేయాలనుకుంటారు. చిన్న చిన్న ఆనందాలు కోరుకునే వారి వ్యక్తిత్వాలు ఆసక్తికరంగా ఉంటాయి. వాళ్లకు పెద్ద పెద్ద ఆశలేం ఉండవు. అలాంటి మహిళలకు గుర్తుగా ఈ సినిమా తెరకెక్కించాను.
కుటుంబానికి సమయం కేటాయించాలి: వృత్తిలో తీరిక లేకుండా పరుగులు పెట్టే మనం కుటుంబానికి సమయం కేటాయించం. ఇంట్లో అమ్మ, భార్య, కూతురు ఇలా మహిళలంతా మనతో కలిసి ఉండే సందర్భాలు కోల్పోతారు. వాళ్లకూ సమయం ఇవ్వాలి అనే సందేశాన్ని చూపిస్తున్నాం. మహిళల భావోద్వేగాలకు సంబంధించిన చిత్రమిది.
గారాల సోదరుడు: ఇంట్లో ఐదుగురు అక్కాచెల్లెల్లకు ఒక సోదరుడు ఉంటాడు. ఏకైక వారసుడైన అతన్ని అక్కా చెల్లెల్లు గారాబంగా, బాధ్యతగా చూస్తుంటారు. వారి భావోద్వేగాలన్నీ సోదరుడి జీవితం చుట్టూనే తిరుగుతుంటాయి. శర్వానంద్ మరో తరహా చిత్రాలు చేస్తున్నాడు. ఆయనకూ ఓ మంచి సకుటుంబ చిత్రంలో నటించాలని ఉండేది. ఈ కథ చెబుతున్నంతసేపూ ఆనందించాడు. కథకు అంగీకారం తెలిపాక మార్పులు చేర్పులు చేశాం. కుటుంబ విలువలు చూపిస్తూనే, వినోదాన్ని అందించే చిత్రమిది. దేవిశ్రీప్రసాద్ పాటలు బాగా కుదిరాయి.