ఉదయ్కిరణ్ ఆత్మహత్య సంఘటనపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు సీనియర్ దర్శకుడు తేజ. ఆయన దర్శకత్వం వహించిన ‘చిత్రం’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు ఉదయ్కిరణ్. అనతికాలంలోనే తారాపథంలో దూసుకెళ్లిన ఈ యువహీరో కెరీర్ పరమైన వైఫల్యాలతో మనోవేదనకు గురై 2014లో ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉదయ్కిరణ్ మరణం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు తేజ. ఆయన మాట్లాడుతూ ‘వరుసగా మూడు భారీ విజయాలు, అనూహ్యమైన స్టార్డమ్తో ఉదయ్కిరణ్ జీవితం బ్యాలెన్స్ తప్పింది.
ఒక్కసారిగా స్టార్డమ్ వస్తే ఎవరైనా సరే బ్యాలెన్స్ తప్పుతారు. దానిని నేను పొగరు అనుకోలేదు. అమాయకత్వంగానే భావించా. ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్తో ఉదయ్ డిప్రెషన్లోకి వెళ్లాడు. ఆ సమయంలో నేను ‘ఔనన్నా కాదన్నా’ చిత్రంలో అవకాశమిచ్చా. షూటింగ్ టైమ్లో.. ‘మీ పట్ల గతంలో నేను పొగరుగా వ్యవహరించా. అయినా నాకు మీరు అవకాశమిచ్చారు. ఒక్కసారి క్షమించండి’ అని అడిగాడు. అలాంటి మాటలు ఏమీ అవసరం లేదని చెప్పాను. తన జీవితంలో జరిగిన అన్ని విషయాల్ని నాతో పంచుకున్నాడు. ఉదయ్కిరణ్ ఆత్మహత్యకు కారణాలేమిటో నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా బయటపెడతా. నేను చనిపోయే లోపు ఆ వివరాల్ని వెల్లడిస్తా’ అని తేజ పేర్కొన్నారు.