‘కామెడీ, థ్రిల్లర్ అంశాలను సమపాళ్లలో కలపడం కష్టం. కానీ ‘హ్యాపీ బర్త్డే’ సినిమాలో ఆ ప్రయత్నం విజయవంతంగా చేసినట్లు కనిపిస్తున్నది’ అన్నారు దర్శకుడు రాజమౌళి. ఆయన అతిథిగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రలో నటిస్తున్నది. రితేష్ రానా దర్శకుడు. క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు.
జూలై 8న విడుదల కాబోతున్నది. ట్రైలర్ విడుదల అనంతరం దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ…‘ట్రైలర్ ఆకట్టుకుంది. సర్రియల్ కామెడీ జానర్లో సరికొత్త ప్రయత్నం చేశారు. నాయికలకు కథను నడిపే కీలక పాత్రలు దొరకడం అరుదు. లావణ్య త్రిపాఠీకి ఈ చిత్రంతో అలాంటి అవకాశం వచ్చింది. ఆమె బాగా నటించినట్లు తెలుస్తున్నది. ఏ కథైనా మనం మనసుపెట్టి రూపొందిస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు’ అన్నారు. ‘ఇదొక కొత్త తరహా సినిమా. ఫిక్షనల్ నేపథ్యంతో కథ సాగుతుంది. ఒకో చాప్టర్ ద్వారా ఒకో పాత్రను పరిచయం చేస్తూ వెళ్లారు దర్శకుడు. చివరలో ఆ పాత్రలన్నీ ఎలా కలుస్తాయి అనేది ఆసక్తికరంగా ఉంటుంది.
ఒక మంచి థ్రిల్లింగ్ కామెడీని ఇందులో చూస్తారు’ అని అన్నారు నిర్మాత చెర్రి. దర్శకుడు రితేష్ రానా మాట్లాడుతూ…‘నా మొదటి చిత్ర బృందంతోనే మళ్లీ పనిచేశాను. దాని కంటే ఈ సినిమాలో రెట్టింపు వినోదం, యాక్షన్, థ్రిల్ ఉంటాయి’ అన్నారు. ‘మాదొక వైవిధ్యమైన సినిమా అని మేము చెప్పకర్లేదు. మీరు ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. నిర్మాత కొత్తగా ఆలోచిస్తేనే ఇలాంటి మూవీ తెరపైకి వస్తుంది. నేను ఈ తరహా సినిమాలో నటిస్తానని అనుకోలేదు.
నా క్యారెక్టర్ సరికొత్తగా సాగుతుంది’ అని చెప్పింది నాయిక లావణ్య త్రిపాఠీ. నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ..‘జాతిరత్నాలు’ సినిమాను ఎలా కుటుంబంతో కలిసి ఆస్వాదించారో ఈ చిత్రాన్నీ అలాగే ఎంజాయ్ చేస్తారు. లావణ్య త్రిపాఠీ నటన ఈ చిత్రానికి ఆకర్షణగా నిలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్లో మా భాగస్వామి చెర్రి. ఆయనకు ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా’ అన్నారు.