‘ఎన్నికల్లో పాల్గొనే అతిపెద్ద నాయకులు ప్రజలే. ఈ అంశాన్ని మా సినిమాలో చూపించాం’ అన్నారు పూజ కొల్లూరు. ఆమె దర్శకత్వం వహించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. సంపూర్ణేష్బాబు, వీకే నరేష్, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రలను పోషించారు. తమిళ రాజకీయ వ్యంగ్య చిత్రం ‘మండేలా’కు తెలుగు రీమేక్ ఇది. ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకురాలు పూజ కొల్లూరు మాట్లాడుతూ “మండేలా’ చిత్రంలో తమిళ రాజకీయాలు, అక్కడి సంస్కృతిని చూపించారు.
తెలుగు రీమేక్లో మన నేటివిటీకి తగినట్లు చాలా మార్పులు చేశాం. ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ ఈ సినిమా చేశాం. ఎవరిని నొప్పించడానికో లేదా ఎవరికో ప్రయోజనం చేకూర్చడానికో తీయలేదు. నేటి రాజకీయాలను వ్యంగ్యాత్మకంగా చూపిస్తుంది. వినోదంతో పాటు బలమైన సందేశం ఉంటుంది. ఎన్నికల్లో ఓటరే కింగ్ అని తెలియజెపుతుంది. ఓటు ఎందుకు వేయాలని నాయకులను ప్రశ్నించేలా ఉంటుంది. మార్టిన్ లూథర్ కింగ్ ఓటు హక్కు కోసం ఎంతో పోరాటం చేశాడు. అందుకే ఆయన పేరును సినిమాకు టైటిల్గా పెట్టాం’ అని చెప్పింది.