మాస్తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు పరశురామ్. కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కథలతో ప్రయాణం సాగిస్తున్నారాయన. ‘గీతగోవిందం’ చిత్రం వందకోట్ల మైలురాయిని దాటి ఆయన కెరీర్కు తిరుగులేని బ్రేక్ నిచ్చింది. మహేష్బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శుక్రవారం దర్శకుడు పరశురామ్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
ఈ ప్రాజెక్ట్కు ఎలా శ్రీకారం చుట్టారు?
మహేష్బాబుతో సినిమా చేయాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నా. నాకున్న పెద్ద కల అది. ‘గీత గోవిందం’ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలోనే మహేష్బాబుకు ‘సర్కారు వారి పాట’ కథ చెప్పా. సంభాషణలతో సహా స్క్రిప్ట్ మొత్తం వినిపించాను. సింగిల్ సిట్టింగ్లోనే మహేష్బాబు ఓకే చెప్పారు. కథలో కొత్తదనంతో పాటు ఆయన పాత్రను మలిచిన విధానం..డైలాగ్ డెలివరీలో కొత్త ైస్టెల్..ఇవన్నీ మహేష్బాబును బాగా ఆకట్టుకున్నాయి. మహేష్ను దృష్టిలో పెట్టుకునే ఈ కథ రాసుకున్నా. ఆయన ఒప్పుకోకపోతే ఈ సినిమా చేసేవాన్ని కాదు.
ఇంతకి ‘సర్కారు వారి పాట’ ద్వారా ఏం చెప్పబోతున్నారు?
పూర్తిస్థాయి వాణిజ్య అంశాలు కలబోసిన చిత్రమిది. ఎంటర్టైన్మెంట్, యాక్షన్ ప్రధానాంశాలుగా సాగుతుంది. మహేష్బాబు ప్రజెంటేషన్, లుక్స్ మునుపెన్నడూ చూడని రేంజ్లో ఉంటాయి. నాలాంటి మధ్యస్థాయి దర్శకుడు మహేష్బాబు వంటి సూపర్స్టార్ ఇచ్చిన అవకాశాన్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకున్నాడనే భావన ప్రేక్షకుల్లో తప్పకుండా కలుగుతుంది.
‘సర్కారు వారి పాట’ అని టైటిల్ పెట్టడానికి కారణమేమిటి?
ఈ కథకు ఆ టైటిల్ తప్ప మరేదీ సూటవదు. కథానుగుణంగానే ఆ టైటిల్ పెట్టాం. బయట చాలా మంది అనుకుంటున్నట్లుగా ఈ సినిమాలో హీరో బ్యాంక్ తరపున పనిచేసే రికవరీ ఏజెంట్ కాదు. కథలో బ్యాంక్ నేపథ్యం ఓ అంశంగా మాత్రమే ఉంటుంది. ఈ సినిమాలో సమాజానికి ఉపయోగపడే మంచి విషయాలుంటాయి. వాటిని కమర్షియల్ పంథాలో తెలియచెప్పాం.. ఓ లక్ష్య సాధన దిశగా సినిమా కథ సాగుతుంది. అదేమిటో సినిమా చూసి తెలుసుకుంటేనే మంచిది.
ట్రైలర్ చూస్తుంటే నాయకానాయికల మధ్య లవ్ట్రాక్కు కూడా చాలా ప్రాధాన్యత ఉన్నట్లు కనిపిస్తున్నది?
అవును. ఈ సినిమాలో మహేష్బాబు-కీర్తి సురేష్ల మధ్య వచ్చే రొమాన్స్ సీన్స్ హైలైట్గా ఉంటాయి. వారిద్దరి అనుబంధంలో చక్కటి హాస్యంతో పాటు ఆకట్టుకునే కెమిస్ట్రీ కనిపిస్తుంది. లవ్ట్రాక్ కథలో కీలకంగా ఉంటుంది. కథానాయిక కీర్తిసురేష్ పాత్రకు కథాగమనంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది.
మహేష్బాబు గత కొంతకాలంగా చేస్తున్న సినిమాల్లో ఏదో ఒక సామాజిక సందేశం ఉంటున్నది. ఇందులో అలాంటి అంశాల్ని ప్రస్తావించారా?
ఈ సినిమాలో ఎలాంటి సందేశం ఉండదు కానీ..ఓ గొప్ప లక్ష్యాన్ని సాధించి కథ ముగుస్తుంది. కథలోని భావోద్వేగాలతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. తమ జీవితాల్లో జరిగే సంఘటనల్ని తెరపై చూస్తున్నామనే భావన కలుగుతుంది.
‘గీత గోవిందం’ చిత్రం వందకోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఆ సినిమా మీ కెరీర్ను ఎంతవరకు ప్రభావితం చేసింది?
దర్శకుడిగా నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. పరశురామ్ 150కోట్ల సినిమా తీసి చూపించగలడు అని అందరూ నమ్మేలా చేసింది. ఎనిమిది కోట్లతో తీసిన సినిమా 140 కోట్ల వసూళ్లు రాబట్టడం మామూలు విషయం కాదు. దర్శకుడిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా నా జీవితంపై ఆ సినిమా గొప్ప ప్రభావాన్ని చూపించింది.
ఈ సినిమా గురించి మీ బాస్ పూరి జగన్నాథ్తో ఏమైనా చర్చించారా?
మహేష్బాబుతో సినిమా చేస్తున్నానని చెప్పగానే పూరి జగన్నాథ్గారు హ్యాపీగా ఫీలయ్యారు. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు బాగుందని ఫస్ట్ మెసేజ్ చేసింది పూరిగారే. ట్రైలర్లో ‘దిస్ ఈజ్ మహేష్ రిపోర్టింగ్ ఫ్రమ్..’ అనే డైలాగ్ సూపర్గా ఉందన్నారు.
తదుపరి సినిమా గురించి..?
14రీల్స్ సంస్థలో నాగచైతన్య కథానాయకుడిగా ఓ సినిమా చేయబోతున్నా.