తెలంగాణ అనే మాట పెద్దగా వినిపించని సమయంలోనే తన సినిమాలో ప్రత్యేక తెలంగాణ పటాన్ని, పదిహేను అడుగుల బతుకుమ్మను పరిచయం చేసిన దర్శకుడు ఎన్. శంకర్. తొలిచిత్రం ‘ఎన్కౌంటర్’లో తెలంగాణ స్థితిగతులను ఆవిష్కరించారు. అస్థిత్వ పోరాటం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో ఆయన తెరకెక్కించిన ‘జై బోలో తెలంగాణ’ ఉద్యమకారుల్లో సమరోత్సాహం నింపింది. ఆ అనుభవాలు, జ్ఞాపకాలు శంకర్ మాటల్లోనే..
చిన్నప్పటి నుంచీ సాహిత్యంపై మక్కువ నాకు. ప్రపంచ విప్లవ సాహిత్యంతో పాటు తెలంగాణ సాహితీవేత్తలు రాసిన కథలు, కవితలు చదివేవాణ్ని. నల్గొండలో పాలిటెక్నిక్ చదివే రోజుల్లో.. భారీ స్థాయిలో ఓ కవి సమ్మేళనం జరిగింది. విద్యార్థి నాయకుడిగా నేనూ ఒక కవిత వినిపించాను. శ్రీశ్రీ, రావిశాస్త్రి నన్ను మెచ్చుకున్నారు. నటుడు ప్రభాకర్ రెడ్డిగారిది మా పొరుగూరే. ఆయన వచ్చినప్పుడు వెళ్లి కలిశాను. నన్ను చెన్నై రమ్మన్నారు. ఆయన సంస్థలోనే సహాయ దర్శకుడిగా చేరాను.
అప్పట్లో పద్నాలుగేండ్లు దాటిన ఏ పిల్లవాడు బయటికి వెళ్లినా తిరిగి వస్తాడన్న నమ్మకం లేదు. ఎవర్ని ఏ క్షణంలో పట్టుకుపోతారో తెలియదు. ‘ఇన్ఫార్మర్’గా ముద్ర వేసేవారు. అనేక ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు జరిగేవి. ఆ సంఘటనల ప్రభావంతోనే నా మొదటి సినిమా ‘ఎన్కౌంటర్’ తీశాను. ప్రారంభంలోనే ప్రత్యేక తెలంగాణ మ్యాప్ చూపించాను. ‘ఇదీ తెలంగాణ’ అని బల్లగుద్ది చెప్పాను. పదిహేను అడుగుల బతుకమ్మనూ చిత్రీకరించాను. ‘ఇదీ మన సంస్కృతి’ అని ఎలుగెత్తి చాటాను. అప్పటికి సినిమాల్లో తెలంగాణ సంప్రదాయాన్ని, సంబురాల్ని చూపించడం అరుదు. నేను ఎంచుకున్న కథాంశాల కారణంగా తొలి రోజుల్లో వివక్షనూ ఎదుర్కొన్నాను. ఆ అవరోధాలను అధిగమించి, బలమైన సంకల్పంతో ముందుకు సాగాను. అదే సమయంలో అమరుల ఆత్మార్పణ నన్ను కదిలించింది. ఆ త్యాగాలు ప్రపంచం మొత్తానికి తెలియాల్సి ఉందని అనిపించింది. అప్పుడే ‘జై బోలో తెలంగాణ’ రూపొందించాను. ఆ సినిమాకు కేసీఆర్ ఎంతో సహకారం అందించారు. థియేటర్స్ ఇప్పించారు. సినిమా విడుదలసమయంలోనూ అనేక అడ్డంకులు వచ్చాయి. అయినా తెలంగాణ సమాజం ఇచ్చిన బలంతో రిలీజ్ చేశాం.
గతంలో తెలుగు సినిమాల్లో హాస్య నటులకు, విలన్లకు తెలంగాణ యాస పెట్టేవారు. ఇప్పుడు తెలంగాణ యాసలో మాట్లాడితేనే సక్సెస్ అవుతుందనేంతగా మార్పు వచ్చింది. విజయవంతమైన ఫార్ములా వెంటే సినిమా పరిశ్రమ పరుగులు పెడుతుంది. దీన్నే ట్రెండ్గా పిలుచుకుంటాం. తెలంగాణ యాస కూడా ఇప్పుడు మన సినిమాల్లో ట్రెండ్గా మారింది. హీరో హీరోయిన్లు కూడా మన యాసనే మాట్లాడుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల్లో యాస, భాష పట్ల ఆసక్తి, ప్రేమ పెరిగాయి. ఇది మంచి పరిణామం.
బ్యాలెట్ పోరుతోనే తెలంగాణ రావాలని కేసీఆర్ బలంగా కోరుకున్నారు. ప్రజా ఉద్యమం పెల్లుబికి.. తెలంగాణ ఇచ్చితీరాల్సిన పరిస్థితిని సృష్టించారు. అలా మన స్వరాష్ట్ర స్వప్నం నెరవేరింది. ముఖ్యమంత్రి విజన్తో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందుతున్నారు. సాగు దండగని గత పాలకులు అంటే… కేసీఆర్ సాగును పండుగ చేశారు. మరోవైపు కేటీఆర్ ఐటీ రంగంలో ప్రపంచంలోని ప్రతిష్ఠా త్మక సంస్థలను నగరానికి తీసుకొస్తున్నారు. త్వరలోనే తెలంగాణ ప్రపంచ పటంలో తన ప్రత్యేకత చాటుతుంది.
…? రమేష్ గోపిశెట్టి