గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా నాయిక. సత్యరాజ్, రావు రమేష్, సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బన్నీ వాసు నిర్మాత. జూలై 1న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. మంగళవారం జరిగిన కార్యక్రమంలో దర్శక నిర్మాతలు మారుతి, బన్నీవాసు చిత్ర విశేషాలు తెలిపారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ..‘నేను ఏ తరహా సినిమాలు చేయగలనో ప్రేక్షకులకు తెలుసు, ఎలాంటి చిత్రాన్ని రూపొందిస్తే బాగుంటుందో కూడా వాళ్లు చెప్పేయగలరు. గోపీచంద్తో నేను చేసిన సినిమా ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు.
ఇందులో హీరోయిజం ఉంటుంది, మంచి ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. హీరోయిన్ క్యారెక్టర్ వినోదాత్మకంగా ఉంటుంది, అలాగే గ్లామర్గా చూపించాం. అన్ని కమర్షియల్ అంశాలు చేర్చి సినిమాను రూపొందించాం. మంచి కథతో సినిమా తెరకెక్కిస్తే తప్పకుండా విజయం సాధిస్తుంది. ఆ కథలో హీరో సరిగ్గా సరిపోవాలి. హీరోకు, దర్శకుడికి మధ్య సృజనాత్మక సారూప్యత ఉండాలి. గోపీచంద్ గత సినిమాలకు భిన్నమైన చిత్రమిది. ఆయన డైలాగ్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంటుంది. నేను పెద్ద స్టార్స్తో సినిమాలు చేసినా మిగతా అందరు హీరోలకు అందుబాటులో ఉంటాను. ఈ హీరోతోనే సినిమా చేయాలన్న పరిమితి పెట్టుకోలేదు’ అన్నారు. నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ..‘మా సినిమాను ప్రేక్షకుల్లోకి బాగా తీసుకెళ్లగలిగాం.
ఫలితం కూడా సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నాం. టికెట్ రేట్లను అందుబాటు ధరల్లోనే పెట్టాం. ఇప్పుడప్పుడే ఓటీటీలోకి వచ్చే సినిమా కాదిది. థియేటర్లోనే చూడమని కోరుతున్నాం. ఓటీటీలోకి వచ్చేందుకు చాలా సమయం ఉంది. ఇటీవల నిర్మాతల చర్చల్లో కూడా థియేటర్ నుంచి ఓటీటీకి సినిమా రావడానికి కావాల్సినంత సమయం ఇవ్వాలని మాట్లాడుకున్నాం. థియేటర్ సిస్టమ్ను చంపుకుంటే రేపు ప్రొడ్యూసర్ ఒక ప్రొడక్షన్ మేనేజర్లా మారిపోతాడు. ఏపీలో ఆన్లైన్ టికెటింగ్ గురించి అగ్రిమెంట్ల విషయంలో కొంత వివాదం నడుస్తున్నది. త్వరలోనే ఇది పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం. లాక్ డౌన్ వల్ల మా సినిమా ఫస్ట్ కాపీ చేతిలో ఉన్నా 8 నెలలు విడుదల కోసం ఆగాల్సివచ్చింది. బడ్జెట్ పెరిగింది. కానీ ప్రస్తుతం మేము బిజినెస్ పరంగా సేఫ్ పొజిషన్లో ఉన్నాం’ అన్నారు.