మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకం ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న పౌరాణిక ప్రణయగాథ ‘శాకుంతలం’. సమంత టైటిల్ రోల్ని పోషిస్తున్నది. ప్రముఖ నిర్మాత దిల్రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. శకుంతల, దుష్యంతుడి ప్రణయం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దుష్యంతుడిగా దేవ్మోహన్ నటించారు. ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది.
ఈ సందర్భంగా సోమవారం కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించేందుకు త్రీడీలో రూపొందిస్తున్నామని చిత్రబృందం తెలిపింది. మోహన్బాబు, ప్రకాష్రాజ్, మధుబాల, గౌతమి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శేఖర్ వి జోసెఫ్, సంగీతం: మణిశర్మ, మాటలు: సాయిమాధవ్ బుర్రా.
మయోసైటిస్ అనే కండరాల వ్యాధితో బాధపడుతున్న సమంత గత కొద్ది నెలలుగా ఇంటివద్దే విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. మయోసైటిస్ బారిన పడిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని, అంతకుముందులా లేదని చెప్పింది. అయితే అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాల వల్లే తాను ధైర్యంగా వ్యాధిపై పోరాడుతున్నానని పేర్కొంది. ఈ క్లిష్ట సమయంలో అభిమానుల నైతిక మద్దతు, వారి ప్రార్థనలు తనకెంతో అవసరమని సమంత కోరింది. తన ఆరోగ్యం బాగుపడాలని కోరుకున్న అభిమానులు, శ్రేయోభిలాషులందరికి సమంత కృతజ్ఞతలు తెలియజేసింది.