‘సక్సెస్ కోసం మనందరం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. దేవతలు ప్రత్యక్షమై మన కోరికలు తీరిస్తే బాగుంటుంది కదా అనే ఫాంటసీ ప్రతీ ఒక్కరికి ఏదో సందర్భంలో వచ్చే ఉంటుంది. అలాంటి ఆలోచన నుంచే ఈ కథ పుట్టింది’ అన్నారు దర్శకుడు చంద్రమోహన్ చింతాడ. ఆయన నిర్ధేశకత్వంలో అల్లరి నరేష్ హీరోగా రూపొందించిన కామెడీ ఎంటర్టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం దర్శకుడు చంద్రమోహన్ చింతాడ విలేకరులతో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ ‘సొంత ఊర్లోనే ఉండి హీరో అవ్వాలనే కలలు కనే వ్యక్తి కథ ఇది. ఏదో మ్యాజిక్ జరిగి తన కోరిక నెరవేరాలనుకుంటాడు.
అలాంటి సమయంలో ఇంట్లో ఉన్న ఓ పుస్తకం గురించి తెలుసుకుంటాడు. దానిపై ఉన్న ప్యాటర్న్స్ సరిగ్గా ఓపెన్ చేస్తే రంభ, ఊర్వశి, మేనక ప్రత్యక్షమవుతారు. ఈ నేపథ్యంలో వారు ఈ భువిపైకి వస్తే ఏం జరిగిందన్నదే ఈ సినిమా కథ’ అని తెలిపారు. ఈ సినిమాలో ఆరోగ్యకరమైన హాస్యం ఉంటుందని, ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చని పేర్కొన్నారు. ‘సంభాషణల విషయంలో త్రివిక్రమ్గారు నాకు స్ఫూర్తి. ఒక మంచి మాటతో నవ్వులు పండిస్తే అది కలకాలం గుర్తుండిపోతుందని ఆయన ఓ సందర్భంలో చెప్పారు. ఈ విషయాన్ని నేను బలంగా నమ్ముతాను’ అని చంద్రమోహన్ చింతాడ పేర్కొన్నారు.