‘జాతిరత్నాలు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచారు యువ దర్శకుడు కేవీ అనుదీప్. ఆయన కథ, స్క్రీన్ప్లే అందించిన తాజా చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. వంశీధర్గౌడ్, లక్ష్మీనారాయణ దర్శకులు. శ్రీజ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీజ నిర్మించారు. సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా కేవీ అనుదీప్ శనివారం పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ సంగతులివి..
ఓ చిన్న టౌన్లో ఫస్ట్ డే సినిమా టికెట్ల కోసం చేసే ప్రయత్నాల నేపథ్యంలో ఈ కథ రాసుకున్నా. చాలా సినిమాలను పరిశీలించి చివరకు ‘ఖుషి’ నేపథ్యాన్ని ఎంపిక చేసుకున్నాం. నారాయణ్ఖేడ్ నేపథ్యంలో కథ నడుస్తుంది. కాలేజీ రోజుల్లో సినిమా టిక్కెట్ల కోసం నేను పడ్డ కష్టాలు, సంఘటనల్ని ఈ కథలో జోడించాను. నారాయణ్ ఖేడ్లో ‘ఖుషి’ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టిక్కెట్లు దొరక్కపోవడంతో మ్యాట్నీ షో చూశా. వంశీ, లక్ష్మీనారాయణ నా బెస్ట్ ఫ్రెండ్స్. మా ముగ్గురి ఆలోచనలు దాదాపు ఒకేలా ఉంటాయి. అందుకే వారికి దర్శకత్వ బాధ్యతల్ని అప్పజెప్పాను. తొలుత ఈ చిత్రానికి నేనే దర్శకత్వం చేయాలనుకున్నా. శివ కార్తికేయన్తో చేస్తున్న ‘ప్రిన్స్’ సినిమాతో బిజీగా ఉండటం వల్ల కుదరలేదు.
అమాయకమైన హాస్యం ఇష్టం
ఆద్యంతం సంపూర్ణ వినోదంతో ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. హీరో శ్రీకాంత్ నా స్నేహితుడే అయినా ఆడిషన్స్ నిర్వహించి నిర్మాతలకు నచ్చాకే ఎంపిక చేసుకున్నాం. నా కామెడీ రైటింగ్లో ఛార్లీ చాప్లిన్ ప్రభావం చాలా ఎక్కువ. అమాయకత్వం నుంచి పుట్టే హాస్యం చాలా మందికి కనెక్ట్ అవుతుందని నమ్ముతాను. హారర్, వయొలెన్స్ తప్ప అన్నీ జోనర్స్ సినిమాల్ని ఇష్టపడతాను. శివకార్తికేయన్తో చేస్తున్న సినిమా కథ పాండిచ్చేరి నేపథ్యంలో నడుస్తుంది. షూటింగ్ దాదాపుగా పూర్తయింది. దీపావళికి విడుదల చేయబోతున్నాం. నా తర్వాతి చిత్రం కోసం రెండు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి. వెంకటేష్గారికి ఓ కథ చెప్పబోతున్నా. అన్నీ కుదిరితే ఆయనతో సినిమా చేసే అవకాశం ఉంది. ‘జాతిరత్నాలు-2’ చిత్రాన్ని రెండేళ్ల తర్వాత చేయాలనుకుంటున్నా.