‘ఖిలాడి’ చిత్రంతో నాయికగా అరంగేట్రం చేసిన తెలుగమ్మాయి డింపుల్ హయతి. ఆమె గోపీచంద్ సరసన నటిస్తున్న సినిమా ‘రామబాణం’. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. శ్రీవాస్ దర్శకుడు. ఈ సినిమా మే 5న విడుదల కానుంది. ఈ సినిమాలో నటించిన అనుభవాలతో పాటు తన కెరీర్ విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపింది నాయిక డింపుల్ హయతి.
వినోదాన్ని పంచే భైరవి
నేను తెలుగమ్మాయినే. నాన్నది తమిళనాడు. అమ్మది విజయవాడ. నేను హైదరాబాద్లో పెరిగాను. కూచిపూడి డ్యాన్సర్గా ప్రదర్శనలు ఇచ్చాను. వేలాదిమంది డ్యాన్సర్లతో సిలికానాంధ్ర ఏర్పాటు చేసిన భారీ ప్రదర్శనలో భాగమైనందుకు నాకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దక్కింది. రవితేజ ‘ఖిలాడీ’తో నాయికగా అరంగేట్రం చేసి ఇప్పుడు ‘రామబాణం’తో ద్వితీయ ప్రయత్నం చేస్తున్నా. ఈ సినిమాలో భైరవి అనే సిటీ అమ్మాయి పాత్రలో కనిపిస్తా. సోషల్ మీడియా వ్లాగర్గా రీల్స్, వీడియోస్ చేస్తుంటాను. నిజ జీవితంలో నేను సోషల్ మీడియాకు దూరంగా ఉంటా. కానీ ఈ సినిమాలో మాత్రం అదే క్యారెక్టర్ చేయాల్సివచ్చింది. భైరవి క్యారెక్టర్ చాలా వినోదాత్మకంగా సాగుతుంది. ప్రధాన కథకు నా పాత్రతో సంబంధం ఉండకున్నా, హీరోతో ఎక్కువ సీన్స్ ఉంటాయి.
మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్
‘రామబాణం’ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటుంది. ఇందులో ఒక సందేశం కూడా ఉంది. ప్రతి సన్నివేశంలో పది మంది నటీనటులు ఉంటారు. గోపీచంద్ ఎక్కువగా మాట్లాడరు. కానీ సన్నివేశాలు, పాటల్లో మాత్రం కోస్టార్గా సహకరిస్తారు. తెలుగు సినీ పరిశ్రమలోకి మరింత మంది తెలుగు అమ్మాయిలు రావాలి. శ్రీలీల, నేను నటిస్తున్నాం. కానీ గతంతో చూస్తే తెలుగు నాయికల ఎంపికలో పరిస్థితి మారింది. నటిగా నిరూపించుకోవాల్సింది ఇంకా ఉంది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో ప్రాజెక్ట్స్కు సంప్రదిస్తున్నారు.