తమిళ నటుడు ధనుష్, మమితా బైజు జంటగా విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కర’. డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న తెలుగు ప్రేక్షకుల ముందుకు విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ సంస్థలు సంయుక్తంగా తీసుకువస్తున్నాయి. ఈ సందర్భంగా విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ అధినేత సీహెచ్. సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. సినిమాపై ఉన్న తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో అర్జున్ రెడ్డి, కబాలి, సలార్ వంటి భారీ చిత్రాలను పంపిణీ చేసిన అనుభవంతో, ధనుష్ గారి ‘ధర్మయోగి’ తర్వాత మళ్లీ ఆయన సినిమాను తెలుగులో రిలీజ్ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సినిమాను దక్కించుకోవడానికి తాను స్వయంగా నిర్మాతను కలిసి ఒప్పించానని, ఇప్పటికే 80 శాతం బిజినెస్ పూర్తయిందని వెల్లడించారు.
ఒక సాధారణ మనిషి ఎదుర్కొనే సమస్యలను అత్యంత బలమైన ఎమోషనల్ కంటెంట్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో దర్శకుడు విఘ్నేశ్ రాజా అద్భుతంగా రూపొందించారని, ఇది ప్రతి సామాన్య ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కరస్వామి అనే వ్యక్తి చుట్టూ తిరిగే కథ కాబట్టే తెలుగులో కూడా ‘కర’ అనే పేరును ఖరారు చేశామని, జీవీ ప్రకాష్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. నైజాంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తుండగా, ఉత్తరాంధ్రలో తానే స్వయంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు 400కు పైగా థియేటర్లలో, హిందీ వెర్షన్తో కలిపి మొత్తం 600 స్క్రీన్లలో ఈ సినిమా విడుదల కాబోతోంది. వేసవిలో ఇప్పటి వరకు పెద్ద సినిమాలేవీ లేకపోవడం ‘కర’ మూవీకి కలిసొచ్చే అంశమని, ప్రేక్షకులతో పాటు పరిశ్రమ వర్గాలు కూడా ఈ చిత్రానికి పూర్తి సహకారం అందిస్తాయని ఆశిస్తున్నట్లు సతీష్ కుమార్ పేర్కొన్నారు. లోకల్ విలేజ్ డ్రామాగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అందరికీ అర్థమయ్యే సమస్యలను ఈ చిత్రంలో చర్చించినట్లు ఆయన వివరించారు.