Mohan Lal | మలయాళ చిత్ర పరిశ్రమలో తిరుగులేని నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్ మోహన్ లాల్ తన వ్యక్తిత్వ హక్కుల (Personality Rights) రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన పేరు, గొంతు, ఫోటోలు, సంతకం లేదా తన నటనకు సంబంధించిన ప్రత్యేకమైన హావభావాలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఏ ఒక్కరూ వాడుకోకుండా చూడాలని ఆయన తన పిటిషన్లో కోరారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి తన రూపాన్ని మార్చడం (Deepfakes), తన గొంతును అనుకరిస్తూ తప్పుడు ప్రకటనలు చేయడం వంటివి తన గౌరవానికి భంగం కలిగిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డిజిటల్ ప్లాట్ఫారమ్లు, అనామక వ్యక్తులు తన ‘మోహన్ లాల్’ అనే బ్రాండ్ను అక్రమంగా వాడుకోకుండా వెంటనే స్టే ఇవ్వాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
అయితే జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్ను విచారించనుంది. గతంలో బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, సోనాక్షి సిన్హాతో పాటు టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కూడా తమ ఇమేజ్ దుర్వినియోగం కాకుండా ఇదే తరహాలో ఢిల్లీ హైకోర్టు నుండి రక్షణ పొందిన విషయం తెలిసిందే. కోర్టు గనుక మోహన్ లాల్కు అనుకూలంగా తీర్పునిస్తే, ఆయన అనుమతి లేకుండా ఆయన బొమ్మలతో టీ-షర్టులు అమ్మడం, మీమ్స్లో వాణిజ్య ప్రకటనలు జోడించడం లేదా ఆయన గొంతుతో AI వీడియోలు సృష్టించడం వంటివి చట్టరీత్యా నేరాలుగా పరిగణించబడతాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘దృశ్యం 3’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.