The Taj Story | బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వివాదాస్పద చిత్రం ‘ది తాజ్ స్టోరీ’ (The Taj Story). ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా విడుదలని అడ్డుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. ఈ చిత్రం చారిత్రక వాస్తవాలను వక్రీకరించడమే కాకుండా, మత సామరస్యాన్ని దెబ్బతీస్తుందని పిటిషనర్ ఆరోపించారు.
అడ్వకేట్ షకీల్ అబ్బాస్ ఈ పిటిషన్ను దాఖలు చేయగా.. ఇందులో ఆయన సెన్సార్ బోర్డు (CBFC), కేంద్ర ప్రభుత్వం, చిత్ర నిర్మాత, దర్శకుడు, నటుడు పరేష్ రావల్ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ చిత్రం తాజ్ మహల్ చారిత్రక వాస్తవాలను వక్రీకరించడమే కాకుండా, మత సామరస్యాన్ని దెబ్బతీస్తుందని తెలిపాడు. అలాగే ఒక ప్రత్యేక రాజకీయ సిద్ధాంతాన్ని ఈ చిత్రం ప్రోత్సహిస్తోందని పిటిషనర్ ఆరోపించారు. ఈ సినిమా విడుదలైతే మత విద్వేషాలకు దారితీసే అవకాశం ఉందని ఇది దేశ లౌకిక స్ఫూర్తిని దెబ్బతీస్తుందని అబ్బాస్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు స్పందిస్తూ.. ఈ పిటిషన్ను తక్షణమే విచారించడానికి నిరాకరించింది. ఈ అంశాన్ని సాధారణ విచారణలో భాగంగా పరిశీలిస్తామని కోర్టు స్పష్టం చేసింది.