Gandhi Talks | భారతీయ చలనచిత్ర తెరపై దశాబ్దాల తర్వాత మళ్ళీ ఒక అద్భుత ప్రయోగం ఆవిష్కృతం కాబోతోంది. అప్పట్లో కమల్ హాసన్ నటించిన ‘పుష్పక విమానం’ వంటి మూకీ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా మంత్రముగ్ధులను చేసిందో మనందరికీ తెలిసిందే. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత, అదే స్థాయిలో భావోద్వేగాలను పండించడానికి ‘గాంధీ టాక్స్’ (Gandhi Talks) అనే మూకీ డ్రామా సిద్ధమైంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. ఈ సినిమాలో మాటలు లేకపోయినా, కేవలం నటీనటుల హావభావాలు మరియు సంగీతంతోనే కథను ప్రేక్షకుల హృదయాలకు చేరువ చేసేలా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ ‘జీ స్టూడియోస్’ ఈ చిత్రాన్ని గాంధీజీ వర్థంతి సందర్భంగా జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇది మూకీ సినిమా అయినప్పటికీ.. తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ మరియు మలయాళ భాషల్లో టైటిల్ కార్డులు, ప్రమోషన్లతో గ్రాండ్గా విడుదల కానుంది. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామిలతో పాటు అందాల నటి అదితి రావు హైదరి, మరాఠీ నటుడు సిద్ధార్థ్ జాదవ్ కీలక పాత్రల్లో నటించారు. మాటలు లేని ఈ సినిమాలో సంగీతమే ప్రాణం. అందుకే ఈ చిత్రానికి ఆస్కార్ విజేత, మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ అద్భుతమైన స్వరాలను అందిస్తున్నాడు. కిషోర్ పి. బేలేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఉమేష్ కుమార్ బన్సల్, రాజేష్ కేజ్రీవాల్, మీరా చోప్రా, కిషోర్ పాండురంగ్ బేలేకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.