జేడీ చక్రవర్తి, రమ్య నంబిసన్, ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్సిరీస్ ‘దయా’. పవన్ సాదినేని దర్శకుడు. ఎస్వీఎఫ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. ఆగస్ట్ 4 నుంచి డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఆదివారం ఈ సిరీస్ ట్రైలర్ను ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ విడుదల చేశారు. ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి మాట్లాడుతూ “గులాబీ’ సినిమాతో నన్ను హీరోను చేసిన కృష్ణవంశీని ఈ కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది.
నేను చేస్తున్న తొలి వెబ్ సిరీస్ ఇది. ఈ సిరీస్లో ప్రతి క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా అందరికి నచ్చుతుంది’ అన్నారు. కథ చెప్పినప్పుడు తన పాత్ర చాలా కొత్తగా అనిపించిందని, సెటిల్డ్ పర్ఫార్మెన్స్ కనబరిచానని కథానాయిక ఈషా రెబ్బా పేర్కొంది. తెలుగులో తాము చేస్తున్న తొలి వెబ్సిరీస్ ఇదని, కొత్త కంటెంట్తో ఆకట్టుకుంటుందని ఎస్వీఎఫ్ ఎంటర్టైన్మెంట్ అభిషేక్ తెలిపారు. వినూత్న కథతో ఈ సిరీస్ను రూపొందించామని దర్శకుడు పవన్ సాదినేని చెప్పారు.