ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘దసరా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తున్నది. సింగరేణి నేపథ్య కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో హీరో నాని ఊర మాస్ పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. ఆయన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటూ ప్రశంసలొస్తున్నారు. ఇక చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తొలి చిత్రంతోనే సత్తా చాటాడు. గ్రామీణ కథను అద్భుతమైన టేకింగ్, ఎమోషన్స్తో తెరపై తీసుకొచ్చిన విధానం అందరిని ఆకట్టుకుంటున్నది.
ఈ సినిమా విజయంతో శ్రీకాంత్ ఓదెలకు భారీ నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్లొస్తున్నట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం అఖిల్ హీరోగా శ్రీకాంత్ ఓదెల ద్వితీయ చిత్రం ఖరారైందని తెలిసింది. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నదని సమాచారం. త్వరలో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలిసింది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ‘ఏజెంట్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది.