Adipurush | ప్రభాస్ టైటిల్ రోల్ పోషించిన ఆదిపురుష్ (Adipurush) సినిమాను వివాదాలు చుట్టముడుతున్న విషయం తెలిసిందే. సినిమా కథ, పాత్రలు వాస్తవ రామాయణానికి భిన్నంగా ఉన్నాయని.. డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ (Manoj Muntashir) పై మండిపడుతున్నారు. ప్రత్యేకించి హనుమంతుడి పాత్ర చెప్పే సంభాషణలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో.. ఆ డైలాగ్స్ సవరణలు కూడా చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఎఫ్టీఐఐ మాజీ చైర్మన్ గజేంద్ర చౌహాన్ (Gajendra Chauhan) ఆదిపురుష్ మేకర్స్ పై మండిపడ్డారు. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నారు గజేంద్ర చౌహాన్.
విల్లు నుండి బాణం ఇప్పటికే విడుదలైంది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎంత బాగ చేయాలని ప్రయత్నించినా కుదరదు. ఎలాంటి ప్రయోజనం లేదు. ప్రజలు ఇప్పటికే సినిమా నిర్మాతను శిక్షించారు. మొదటి రోజు, ఇవాళ్టి కలెక్షన్లను చూడండి. వారు శిక్షకు అర్హులు, శిక్షించబడాలంటూ మండిపడ్డారు. డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్నుద్దేశిస్తూ… అతనికి నిజంగా జ్ఞానం లేదు. ఆయన మాటల రచయిత కాబట్టి డైలాగులు రాయమని అడిగారు. సోషల్ మీడియాలో ప్రసారమయ్యే రచయితల వీడియోల నుంచి రాసుకున్న డైలాగ్లను మనోజ్ ముంతాషిర్ ఆదిపురుష్లో పెట్టాడని గజేంద్ర చౌహాన్ విమర్శించారు.
ఆదిపురుష్పై వెంటనే నిషేధం విధించాలని గజేంద్ర చౌహాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘నీ లంకకు నిప్పు పెట్టేస్తా’ అని కుమార్ విశ్వాస్ చెప్పిన డైలాగ్ లాగా.. ఇలాంటివన్నీ కలగలిపి డైలాగ్స్ రాసుకున్నట్లుగా మనోజ్ ముంతాషిర్ ప్రజెంట్ చేశారని అన్నారు గజేంద్ర చౌహాన్.
ఆదిపురుష్లో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ లంకేశ్ పాత్రలో నటించారు. మరాఠి నటుడు దేవ్దత్త నగే ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో నటించగా.. బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ లక్ష్మణుడిగా కనిపించనున్నాడు. టీ సిరీస్, రెట్రోఫైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. సాచెట్-పరంపర ద్వయం ఈ ఎపిక్ డ్రామాకు మ్యూజిక్ అందించారు.