“క్రేజీఫెలో’ చిత్రం క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నది. కొత్తదనం కలబోసిన కథ ఇదని అందరూ ప్రశంసిస్తున్నారు’ అని చెప్పారు కె.కె.రాధామోహన్. ఆయన నిర్మాతగా తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆది సాయికుమార్, దిగంగన సూర్యవంశీ, మిర్నా మీనన్ నాయకా నాయికలుగా నటించారు. ఫణికృష్ణ సిరికి దర్శకుడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘కొత్త కథల్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమా నిరూపించింది. అన్ని కేంద్రాల్లో మంచి స్పందన లభిస్తున్నది. కామెడీ బాగా పండిందని మెచ్చుకుంటున్నారు’ అని చెప్పారు.
‘ఈ సినిమాకు మౌత్టాక్ అద్భుతంగా ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వుకున్నామని అంటున్నారు. దర్శకుడు కథను ఎంతగానో ప్రేమించి తీశాడు. కెరీర్లో ఓ మంచి సినిమా చేశాననే సంతృప్తి మిగిలింది’ అని హీరో ఆది తెలిపారు. తన కెరీర్లో ప్రత్యేకమైన చిత్రమిదని కథానాయిక దిగంగన సూర్యవంశీ ఆనందం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.