లాక్డౌన్ తర్వాత బాలీవుడ్ (Bollywood) ఇండస్ట్రీ క్లిష్టపరిస్థితులు ఎదుర్కొంటోంది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు బాలీవుడ్ను పలుకరిస్తూనే ఉన్నాయి. ఇటీవలే విడుదలైన లాల్ సింగ్ చద్దా, రక్షాబంధన్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. తాజాగా రెండు బాలీవుడ్ చిత్రాలపై ఫిర్యాదులు నమోదయ్యాయి.
అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha), తాప్సీ నటించిన శభాష్ మిథు (Shabaash Mithu) చిత్రాల్లో వికలాంగులను కించపరిచేలా సీన్లున్నాయని..రెండు సినిమాలు వికలాంగులను ఎగతాళి చేసేలా ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. 70% లోకోమోటర్ వైకల్యంతో బాధపడుతున్న Doctors with Disabilities కో ఫౌండర్ డాక్టర్ సతేంద్రసింగ్ ఈ ఫిర్యాదు దాఖలు చేశారు.
ఈ రెండు సినిమాలు వికలాంగుల హక్కుల చట్టం-2016ను ఉల్లంఘించి వికలాంగుల హక్కులకు భంగం కలిగించాయని ఫిర్యాదులోపేర్కొన్నారు. రెండు చిత్రాల్లో ‘లాంగ్డే లేదా లాంగ్డీ’ (వికలాంగుడు) అనే పదాన్ని వాడటాన్ని ఆయన ప్రశ్నించారు. వైకల్యాన్ని సూచించేందుకు బదులుగా ఒకరిని ఉద్దేశపూర్వకంగా కించపరిచేందుకు ఈ పదాన్ని ఉపయోగిస్తారని..దీనిపై మేకర్స్ 30 రోజుల్లోగా స్పందించాలని డెడ్లైన్ విధించారు.