హైదరాబాద్ : తెలుగు చలన చిత్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు లభించడం ఎంతో సంతోషదాయకం అని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికై భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్న కలర్ ఫోటో మూవీ చిత్ర దర్శకులు సందీప్ రాజ్.. మంత్రి శ్రీనివాస్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనకు లభించిన అవార్డు, ప్రశంసా పత్రాన్ని మంత్రికి చూపించారు. మంత్రి తలసాని సందీప్ రాజ్ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
గత నెల 30వ తేదీన ఢిల్లీలో నిర్వహించిన 68వ జాతీయ ఫిలిం అవార్డ్ వేడుకల్లో కలర్ ఫోటో మూవీ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన విషయాన్ని డైరెక్టర్ సందీప్ రాజ్ మంత్రికి వివరించారు. మంత్రిని కలిసిన వారిలో యాదవ్ సంఘం రాష్ట్ర యువజన నాయకులు నవీన్ యాదవ్, రాహుల్ యాదవ్, ప్రదీప్, వంశీరెడ్డి, గంగాధర్ తదితరులు ఉన్నారు.