ఏపీలో సినిమా టికెట్ల ధరల (Movie Ticket Prices) పెంపు విషయంలో తాము కోరుకున్నట్టు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిందని టాలీవుడ్ (Tollywood) నిర్మాత సీ కల్యాణ్ (c kalyan) అన్నారు. సోమవారం జారీ చేసిన జీవోతో అన్ని సమస్యలకు తెరపడిందన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో టికెట్ల విషయంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి జీవో జారీ చేసిన ఏపీ సీఎం జగన్ (YS Rajasekhara Reddy), మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు తెలియజేశారు.
గ్రామ పంచాయతీల్లో చిన్న సవరణలున్నాయి. సీఎంను కలిసి ఆ విషయాన్ని వివరిస్తాం. త్వరలో సినీ ఇండస్ట్రీ మొత్తం సమావేశమవుతాం. చిన్న సినిమాలపై చర్చిస్తాం. త్వరలో ఇరు రాష్ట్రాల సీఎంలను సన్మానిస్తామని సీ కల్యాణ్ అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు మేలు కలిగించేలా, అందరికీ వినోదాన్ని అందించే ఉద్దేశంతో సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ జీవోజారీచేసిన సీఎం వైఎస్ జగన్కు ఇప్పటికే సినీ పరిశ్రమ తరపున చిరంజీవి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ ట్వీట్ కూడా చేసిన విషయం తెలిసిందే.
ఏపీ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో ప్రకారం సినిమా టికెట్ కనిష్ట ధర రూ.20గా, గరిష్ట ధర రూ.250గా ఉంది. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో పెద్ద సినిమాలు, చిన్న సినిమాలకు మేలు జరిగే అవశాముందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.