తెలుగు సినీరంగంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (53) ఆదివారం సాయంత్రం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన అసలు పేరు ఎస్.రామారావు. ఆదివారం ఉదయం రక్త విరోచనాలు చేసుకోవడంతో ఆయన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల రాకేశ్ మాస్టర్ మరణించినట్లు గాంధీ ఆసుప్రతి సూపరింటెండెంట్ రాజా రావు తెలిపారు.
‘ఆట’ ‘ఢీ’ వంటి రియాల్టీ షోల ద్వారా కెరీర్ను మొదలుపెట్టారాయన. ‘జబర్దస్త్’షోలో కూడా కొన్ని ఎపిసోడ్స్లో పాల్గొన్నారు. దాదాపు 1500 చిత్రాలకు కొరియోగ్రఫీని అందించారు. సీతయ్య, చిరునవ్వుతో, దేవదాస్, లాహిరి లాహిరి లాహిరిలో, అమ్మో పోలీసోళ్లు వంటి హిట్ చిత్రాలకు పనిచేశారు. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేసిన ఘనత ఆయన సొంతం.
ప్రస్తుతం తెలుగులో అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్స్గా చెలామణి అవుతున్న శేఖర్, జానీ మాస్టర్లు ఆయన శిష్యులే. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న రాకేశ్ మాస్టర్ యూట్యూబ్ ఛానళ్ల ఇంటర్వ్యూస్ ద్వారా వార్తల్లో నిలిచారు. కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాకేశ్ మాస్టర్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.