సినీ ప్రముఖుల భేటీలో ఏపీ సీఎం జగన్ వెల్లడి
సమస్యలకు శుభం కార్డ్ పడిందన్న చిరంజీవి
హైదరాబాద్, ఫిబ్రవరి 10 : సినీ పరిశ్రమ పురోభివృద్ధికి అందరికి ఆమోదయోగ్యమైన పాలసీ తేవడాడినికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ప్రేక్షకులకు, సినీరంగానికి మధ్య సమతుల్యతను పాటిస్తూ నిర్ణయాలు తీసుకుంటామని హామీఇచ్చారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సినీ ప్రముఖులు చిరంజీవి, ప్రభాస్, మహేశ్బాబు, పోసాని కృష్ణమురళి, అలీ, ఆర్ నారాయణమూర్తి, రాజమౌళి, కొరటాల శివ తదితరులు సీఎం జగన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పెద్ద, చిన్న సినిమాలకు సమన్యాయం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలిపారు. సినిమా టికెట్ రేట్ల విషయంలో ఏ సినిమాకైనా ఒకే రేటు ఉండాలని జగన్ అభిప్రాయపడ్డారు. వందకోట్లు, ఆపై వ్యయంతో నిర్మించే భారీ బడ్జెట్ చిత్రాలకు వారంపాటు ప్రత్యేక ధరలు నిర్ణయించడం సమంజసంగా ఉంటుందని చెప్పారు. ఈ విషయమై చిరంజీవి చర్చించానని పేర్కొన్నారు. సినీరంగ సమస్యలపై నియమించిన కమిటీ మంచి సూచనలు అందజేసిందని, ఏపీలో షూటింగ్స్ చేసే విషయమై సినిమాటోగ్రఫీ మంత్రి నాని దర్శకనిర్మాతలతో చర్చలు జరిపారని పేర్కొన్నారు. కనీసం ఇరవైశాతం మేరకు ఏపీలో చిత్రీకరణ జరిపే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని దర్శకనిర్మాతలు చెప్పారని పేర్కొన్నారు.
ప్రేక్షకులకు భారం కావొద్దు
సినీ పరిశ్రమ అభివృద్ధిని కాంక్షిస్తూ టికెట్ రేట్లు సవరించాలని నిర్ణయం తీసకున్నామని, పెంచిన రేట్లు ప్రేక్షకులకు భారం కావొద్దని సీఎం జగన్ సూచించారు. ‘ఏడాదికి వెయ్యి రూపాయలతో అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. అంటే నెలకు 80 రూపాయలు పడుతుంది. ఈ విషయాన్ని కూడా దర్శకనిర్మాతలు దృష్టిలో పెట్టుకోవాలి. ఐదో ఆటకు కూడా అనుమతిఇవ్వాలని అడిగారు. ఆ సమస్యను కూడా అర్థం చేసుకున్నాం. ఐదో ఆట వల్ల సినీరంగానికి చాలా మేలు జరుగుతుంది. చిన్న సినిమాలకు కూడా ఐదో షో వర్తిస్తుంది. మల్టీఫ్లెక్స్లలో కూడా సరైన టికెట్ రేట్లను నిర్ణయిస్తాం’ అని జగన్ తెలిపారు.
సీఎం సానుకుల స్పందన: చిరంజీవి
సినీరంగ సమస్యలపై సీంఎం జగన్ తీసుకున్న నిర్ణయాల పట్ల అగ్రహీరో చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. టికెట్ రేట్లకు సంబంధించిన వ్యవహారానికి శుభం కార్డు పడినట్లుగా భావిస్తున్నామని అన్నారు. సీంఎతో భేటీ అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ‘పరిశ్రమ సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పరిశ్రమకు, ప్రేక్షకులకు ఆమోదయోగ్యంగా సీఎం నిర్ణయాలు తీసుకున్నారు. నేను గతంలో చర్చించిన విషయాల్ని పరిగణనలోకి తీసుకొని మాట్లాడారు. దర్శకనిర్మాతలు, పరిశ్రమ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఐదో ఆటకు అనుమతి కోరగా అంగీకరించారు. ఈ నెల మూడోవారంలోపు పరిశ్రమకు సంబంధించిన విధానాలపై జీవో విడుదలయ్యే అవకాశం ఉంది’ అని చిరంజీవి తెలిపారు.