దుష్టశక్తి విజృంభించిన ప్రతిసారీ.. దాన్ని తుదముట్టిచేందుకు దైవశక్తి ఉద్భవిస్తూనే ఉంది. దైవాంశగల కారణజన్ముడు పుడుతూనేవున్నాడు. హిరణ్యాక్షుడి నుంచి హిట్లర్ వరకూ చరిత్ర చెబుతున్న సత్యం అది. చిరంజీవి ‘విశ్వంభర’ కథ కూడా దాదాపుగా ఇదే. ఇరవై ఏళ్ల విరామం తర్వాత చిరంజీవి చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ఇది.
తొలి సినిమా ‘బింబిసార’ను ఫాంటసీ కథతో తెరకెక్కించి, శభాష్ అనిపించుకున్న దర్శకుడు వశిష్ఠ.. ఈ మెగా ప్రాజెక్ట్కు దర్శకుడు కావడంతో సినిమాపై అంచనాలు ఎవరెస్ట్ని తాకాయి. త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మరికొందరు నాయికలు మెగాస్టార్తో జతకట్టనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ‘విశ్వంభర’ విడుదల కానుంది.
ఇదిలావుంటే.. ఈ సినిమా షూటింగ్ గత 26 రోజులుగా హైదరాబాద్లో నిరవధికంగా జరుగుతున్నది. టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాశ్ నిర్మించిన 54 అడుగుల హనుమాన్ విగ్రహంతో కూడిన భారీ సెట్లో స్టంట్ సీక్వెన్స్ని చిత్రీకరిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో రూపొందిస్తున్న ఈ భారీ పోరాట సన్నివేశాలు సినిమాకే హైలైట్గా నిలువనున్నాయని మేకర్స్ చెబుతున్నారు.
ఇంటర్వెల్ బ్యాంగ్లో వచ్చే ఈ ఫైట్ కోసం చిరంజీవి 26 రోజులు కేటాయించారు. ఆయన కెరీర్లో ఒక్క ఫైట్ సీక్వెన్స్ కోసం ఇన్ని రోజులు కేటాయించడం ఇదే ప్రధమం. ఈ షూట్ సోమవారంతో పూర్తయింది. మాస్ని మెస్మరైజ్ చేసేలా మెగా లెవల్లో ఈ ఫైట్ ఉండనుందని చిత్రబృదం తెలిపింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరాలందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు.