చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా కథానాయిక. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నది.
ఆగస్ట్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా స్విట్జర్లాండ్లో చిత్రీకరణ జరుపుకుంటున్నది. అక్కడి సుందరమైన లొకేషన్లలో చిరంజీవి, తమన్నాలపై ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. ఈ పాట సినిమాలో ప్రధానాకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. స్విట్జర్లాండ్ షెడ్యూల్లో పాటతో పాటు కీలక తారాగణం పాల్గొనగా ముఖ్య సన్నివేశాలను కూడా తెరకెక్కిస్తారని సమాచారం. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతాన్నందిస్తున్నాడు.