Chiranjeevi | తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ సినీ నటుడు జీవీ నారాయణరావు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన చిరకాల ఆత్మీయ మిత్రుడిని కోల్పోవడం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా జీవీ నారాయణరావుతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని, సినీ ప్రయాణంలో కలిసి పంచుకున్న మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయన భావోద్వేగ నివాళి అర్పించారు.
దిగ్గజ దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన ‘అంతులేని కథ’ చిత్రంతో 1976లో వెండితెరకు పరిచయమైన జీవీ నారాయణరావు.. అనంతరం పలు చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సినిమాలతో పాటు టెలివిజన్ సీరియళ్లలోనూ నటిస్తూ తనదైన ముద్ర వేశారు. నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఆయన తెలుగు సినీ పరిశ్రమకు విశేష సేవలు అందించారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో జీవీ నారాయణరావుకు ఎంతో సన్నిహిత అనుబంధం ఉంది. చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘దేవాంతకుడు’, ‘యముడికి మొగుడు’ వంటి చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ‘యముడికి మొగుడు’ భారీ విజయాన్ని సాధించి చిరంజీవి కెరీర్లో ప్రత్యేక చిత్రంగా నిలిచింది. మరోవైపు ‘గ్యాంగ్ లీడర్’, ‘హిట్లర్’ వంటి పలు సినిమాలతో కూడా జీవీ నారాయణరావు సినీ ప్రయాణం ముడిపడి ఉంది.
ఈ సందర్భంగా చిరంజీవి స్పందిస్తూ.. తన ఆత్మీయ మిత్రుడు జీవీ నారాయణరావు ఇక లేరనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. నిర్మాతగా, నటుడిగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా తమ మధ్య ఎంతో ఆత్మీయమైన అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. తాను నటించిన ‘దేవాంతకుడు’, ‘యముడికి మొగుడు’ చిత్రాల సందర్భంగా కలిసి పనిచేసిన రోజులు ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చాయని పేర్కొన్నారు.జీవీ నారాయణరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చిరంజీవి తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నటుడిగా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న జీవీ నారాయణరావు సినీ ప్రయాణం చిరస్మరణీయమని పలువురు కొనియాడుతున్నారు.