ఇలవేల్పు ఆంజనేయుని సాక్షిగా అగ్ర నటుడు చిరంజీవి తన తమ్ముడైన పవన్కల్యాణ్ని ఆశీర్వదించారు. అంతేకాదు, వచ్చే నెలలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తన తమ్ముడు పవన్కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఐదుకోట్ల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్లో నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘విశ్వంభర’ షూటింగ్ లొకేషన్ ఈ అన్నదమ్ముల కలయికకు వేదిక అయ్యింది.
సోమవారం ఉదయం పది గంటలకు తన చిన్న అన్నయ్య నాగబాబుతో కలిసి ‘విశ్వంభర’ లొకేషన్కి చేరుకున్నారు పవన్కల్యాణ్. తన తమ్ముళ్లిద్దర్నీ ప్రేమపూర్వక ఆలింగనంతో స్వాగతం పలికారు మెగాస్టార్. అన్నయ్య ఆశీర్వాదం అందుకున్న పవన్కల్యాణ్ భావోద్వేగానికి లోనై చిరంజీవి పాదాలకు నమస్కరించారు. అనంతరం లొకేషన్లోనే ముగ్గురు అన్నదమ్ములు కొంతసేపు సంభాషించుకున్నారు. ఇంకా పలువురు జనసేన నాయకులు కూడా చిరంజీవిని కలిసినవారిలో ఉన్నారు.