Chinmayi | భారతదేశంలో అత్యున్నత సాహిత్య పురస్కారంగా భావించే జ్ఞానపీఠ్ అవార్డును 2025 సంవత్సరానికి గాను ప్రముఖ తమిళ కవి, సినీ గేయ రచయిత వైరముత్తుకు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ గౌరవంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. వైరముత్తు జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపిక కావడం తమిళ సాహిత్య ప్రపంచానికి గర్వకారణమని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. తన కవిత్వ ప్రతిభతో తమిళ భాషకు గొప్ప గుర్తింపు తీసుకొచ్చిన కవిపేరరసు వైరముత్తుకు ఈ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఉదయం ఆయనను కలిసిన కొద్దిసేపటికే ఈ సంతోషకరమైన వార్త రావడం మరింత ఆనందాన్ని ఇచ్చిందని స్టాలిన్ వెల్లడించారు.
ఇప్పటివరకు తమిళంలో అఖిలన్, జయకాంతన్ మాత్రమే జ్ఞానపీఠ్ అందుకున్నారని, ఇప్పుడు వైరముత్తు కూడా ఆ గౌరవాన్ని అందుకోవడం తమిళ సాహిత్యానికి గొప్ప విషయం అని అన్నారు. తమ నాయకుడు కలైంజర్ ఈరోజు ఉంటే వైరముత్తును ఎంతో ప్రేమగా అభినందించేవారని కూడా స్టాలిన్ వ్యాఖ్యానించారు.ఇక కమల్ హాసన్ కూడా వైరముత్తుకు అభినందనలు తెలియజేశారు. సుదీర్ఘమైన సంప్రదాయం కలిగిన తమిళ సాహిత్యానికి మరోసారి జ్ఞానపీఠ్ అవార్డు రావడం ఎంతో గర్వకారణమని అన్నారు. జయకాంతన్ తర్వాత ఇన్నేళ్లకు తమిళానికి ఈ గౌరవాన్ని తీసుకొచ్చిన తన ప్రియ మిత్రుడు వైరముత్తుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వైరముత్తు రాసిన కవితా పంక్తులు తన జీవితంలో ప్రత్యేక స్థానం సంపాదించాయని కమల్ హాసన్ పేర్కొన్నారు.
అయితే వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డు రావడాన్ని అభినందిస్తూ కమల్ హాసన్ చేసిన ట్వీట్పై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తీవ్రంగా స్పందించారు. కమల్ హాసన్ పోస్టును ట్యాగ్ చేస్తూ ఆమె విమర్శలు గుప్పించారు. వైరముత్తుపై గతంలో తాను లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినప్పటికీ, ఆయనలాంటి వ్యక్తిని ప్రశంసించడం సరైనది కాదని చిన్మయి వ్యాఖ్యానించారు. మహిళల సమస్యలను పట్టించుకోని వ్యక్తులు తమకు మద్దతుగా ఉండరని మహిళా ఓటర్లు గుర్తుంచుకోవాలని ఆమె పేర్కొన్నారు. గతంలో ‘మీటూ’ ఉద్యమ సమయంలో వైరముత్తుపై చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనకు దేశ అత్యున్నత సాహిత్య పురస్కారం రావడం, కమల్ హాసన్ అభినందించడం నేపథ్యంలో చిన్మయి సోషల్ మీడియాలో మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది.