Chinmayi | తమిళ సినీ గీత రచయిత వైరముత్తుకు దేశంలో అత్యున్నత సాహిత్య పురస్కారంగా భావించే జ్ఞానపీఠ్ అవార్డు ప్రకటించడంతో మరోసారి వివాదం చెలరేగింది. ముఖ్యంగా ‘మీటూ’ ఉద్యమం సమయంలో వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన గాయని చిన్మయి శ్రీపాద ఇప్పుడు ఈ అంశంపై ఘాటుగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది. సినీ, రాజకీయ ప్రముఖులు వైరముత్తును అభినందిస్తుండగా.. ఆయనపై గతంలో చేసిన ఆరోపణలను గుర్తుచేస్తూ చిన్మయి విమర్శలు గుప్పిస్తోంది. జ్ఞానపీఠ్ పురస్కారానికి వైరముత్తు ఎంపిక కావడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ప్రముఖ తమిళ కవి, సినీ గీత రచయితగా వైరముత్తు చేసిన సేవలను ప్రశంసిస్తూ ఆయన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు.
కవిత్వం, నవలలు, సినీ పాటల ద్వారా సమాజంలోని సున్నిత భావాలను ఆయన తన రచనల్లో ప్రతిబింబించారని పవన్ కళ్యాణ్ అన్నారు. సినీ గీత రచయితగా ఏడు జాతీయ అవార్డులు అందుకున్న ఘనత కూడా వైరముత్తు సొంతమని పేర్కొంటూ, ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.అయితే పవన్ కళ్యాణ్ అభినందనలపై చిన్మయి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్కు వైరముత్తు అసలు స్వరూపం గురించి పూర్తిగా తెలియదని తాను నమ్ముతున్నానని పేర్కొంది. ఎన్నో మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి రాజకీయ నాయకులు ఇలా శుభాకాంక్షలు తెలపడం ఎందుకు అవసరమో తనకు అర్థం కావడం లేదని ప్రశ్నించింది. పవన్ కళ్యాణ్ కార్యాలయం ఆయనకు ఈ విషయాలు తెలియజేయాలని కూడా చిన్మయి తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది.
ఇదే విషయంపై వైరముత్తును అభినందించిన ప్రముఖ నటులు కమల్ హాసన్, రజనీకాంత్లపై కూడా చిన్మయి విమర్శలు చేసింది. రజనీకాంత్ చేసిన పోస్టుకు స్పందిస్తూ “అయ్యయ్యో.. అర్థమే కావట్లేదా?” అంటూ కామెంట్ చేసింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొందరు నెటిజన్లు ఆమెకు మద్దతు తెలపగా, మరికొందరు విమర్శలు చేశారు.ఈ కామెంట్లపై కూడా చిన్మయి స్పందించింది. తాను చాలా సంవత్సరాలుగా వైరముత్తుపై ఆరోపణల గురించి మాట్లాడుతున్నానని, తనను ఇండస్ట్రీలో బ్యాన్ చేసినప్పుడు చాలామంది నిశ్శబ్దంగా ఉన్నారని పేర్కొంది. అయినప్పటికీ ఈ అంశాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తూనే ఉంటానని ఆమె స్పష్టం చేసింది.