Chinamyi | సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దాడులకు గట్టి సమాధానం ఇచ్చారు. మహిళల హక్కులు, భద్రత వంటి అంశాలపై గళమెత్తే చిన్మయి తరచూ ట్రోలింగ్కు గురయ్యే విషయం తెలిసిందే. అయితే ప్రతి సారి ధైర్యంగా స్పందిస్తూ, ట్రోలర్లను ఎదుర్కొనే తీరుతో ఆమె పలుమార్లు ప్రశంసలు పొందారు. తాజాగా ఆమెపై మార్ఫింగ్ ఫోటోలతో దాడి చేసిన వ్యక్తులపై చిన్మయి ఘాటుగా స్పందించి వీడియోను షేర్ చేశారు. చిన్మయి తన మార్ఫింగ్ చేసిన ఫోటోను, దాన్ని షేర్ చేసిన అకౌంట్ స్క్రీన్షాట్ను పోస్ట్ చేస్తూ, వెంటనే పోలీసులకు కంప్లయింట్ చేసినట్లు తెలిపారు. గత 8–10 వారాలుగా కొంతమంది డబ్బులు తీసుకుని తనను, తన కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వీడియోలో పేర్కొన్నారు.
ఈరోజు నాకు మార్ఫ్ చేసిన ఫోటో పంపించారు. వెంటనే పోలీసులకు ట్యాగ్ చేశాను. చట్టపరమైన చర్యలు తీసుకుంటారో లేదో ముఖ్యం కాదు. కానీ ఇలాంటి వ్యక్తులు అమ్మాయిలను, వారి కుటుంబాలను వేధించకుండా ఉండేందుకు ఈ వీడియో చేస్తున్నాను” అని ఆమె స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ రిలీజ్ సమయంలో చిన్మయి, ఆమె భర్త రాహుల్ రవీంద్రన్పై నెటిజన్లు తీవ్ర విమర్శలు, అసభ్య కామెంట్లు చేశారు. రాహుల్ ..మంగళసూత్రం గురించి మాట్లాడిన పాత వీడియోను బయటకు తీసి, దారుణమైన పదజాలంతో దూషించారు. ఈ సందర్భంలో చిన్మయి మహిళల భద్రతపై వ్యాఖ్యానించడంతో మరింతగా ట్రోలింగ్ జరిగింది. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్కు ఎక్స్ ద్వారా ఫిర్యాదు చేశారు.
ఇప్పుడు షేర్ చేసిన తాజా వీడియోలో కూడా చిన్మయి కొంతమంది నెటిజన్ల పేర్లు ప్రస్తావిస్తూ, “పుట్టిన పిల్లలు చనిపోవాలని కోరుకునే ఇటువంటి అబ్బాయిలకు అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేయాలా?” అంటూ ప్రశ్నించారు. మార్ఫింగ్ ఫోటోలు వచ్చినప్పుడు భయపడకుండా, వెంటనే తమ కుటుంబ సభ్యులకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయాలని మహిళలకు సూచించారు.చిన్మయి షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ధైర్యసాహసాలను పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నప్పటికీ, మరోవైపు ఆమెను ట్రోల్ చేయడానికి ప్రయత్నించే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.