బాలీవుడ్ నటి సోనాక్షిసిన్హాపై ఓ చీటింగ్ కేసు విషయంలో నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఓ ఈవెంట్కు సంబంధించిన డబ్బు ఎగవేత కేసులో ఈ అమ్మడు వివాదంలో చిక్కుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఈవెంట్ మేనేజర్ ప్రమోద్ ఓ కార్యక్రమానికి సోనాక్షిసిన్హాను అతిథిగా ఆహ్వానించారు. అందుకుగాను ముందస్తుగా 37లక్షల్ని చెల్లించారు. అనివార్య కారణాల వల్ల సోనాక్షిసిన్హా ఆ కార్యక్రమానికి హాజరుకాలేక పోయింది. దాంతో చెల్లించిన డబ్బును తిరిగి ఇవ్వాలంటూ ఈవెంట్ నిర్వాహకులు సోనాక్షిసిన్హా మేనేజర్పై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చివరకు కోర్టును ఆశ్రయించారు. చీటింగ్ కేసుగా పరిగణిస్తూ సోనాక్షిసిన్హాపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్టేట్మెంట్ రికార్డు సందర్భంగా ఓసారి కోర్టుకు వచ్చిన సోనాక్షిసిన్హా అనంతరం విచారణకు వరుసగా గైర్హాజరైంది. దీంతో న్యాయమూర్తి ఆమెపై నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. వృత్తిపరమైన బిజీలో ఉండటం వల్ల సోనాక్షిసిన్హా కోర్టుకు హాజరుకాలేకపోయిందని..ఇందులో ఉద్దేశ్యపూర్వకమైన తప్పిదం ఏమీ లేదని ఆమె సన్నిహితులు చెప్పారు. ఈ కేసును రాజీ ప్రయత్నాల ద్వారా పరిష్కరించుకుంటామని వారు పేర్కొన్నారు.