‘ఛత్రపతి’ రీమేక్ ద్వారా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హిందీ చిత్రసీమలో కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్లో వైభవంగా ప్రారంభమైంది. పెన్ స్టూడియోస్ పతాకంపై ధవల్ జయంతిలాల్ గడ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి క్లాప్నివ్వగా, రమారాజమౌళి కెమెరా స్విఛాన్ చేశారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం గౌరవ దర్శకత్వం వహించారు. అగ్ర రచయిత విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ను అందించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘అత్యుత్తమ నిర్మాణ విలువలతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాం. ‘ఛత్రపతి’ చిత్రానికి కథా రచయిత విజయేంద్రప్రసాద్గారే ఈ రీమేక్కు కథనందిస్తున్నారు. హిందీ నేటివిటీకి తగినట్లు కథలో మార్పులు చేశాం. అద్భుతమైన కలయికలో ఈ సినిమా రూపొందుతోంది. తన పాత్ర కోసం హీరో శ్రీనివాస్ చక్కటి శరీరాకృతిని సొంతం చేసుకున్నారు. శిక్షణ తీసుకొని హిందీ భాషపై పట్టు సాధించారు. భారతీయ సినిమాలో ఈ ప్రాజెక్ట్ చరిత్ర సృష్టిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు. సాహిల్వైద్, అమిత్ నాయర్, రాజేంద్రగుప్తా, శివం పాటిల్, స్వప్నిల్, ఆశిష్సింగ్, మహ్మద్ మోనాజిర్, అరుషిక దే, వేదిక, జాసన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నాజిర్ అలీ షఫీ, స్టంట్స్: అనల్ అరసు, సంగీతం: తనిష్క్ బగ్చి, ఆర్ట్: శ్రీను, కథ: కె.వి.విజయేంద్రప్రసాద్, సమర్పణ: డా.జయంతిలాల్ గడ, నిర్మాతలు: ధవల్ జయంతిలాల్ గడ, అక్షయ్ జయంతిలాల్ గడ, నిర్మాణ సంస్థలు: పెన్ మరుదర్ సినీ ఎంటర్టైన్మెంట్, పెన్ స్టూడియోస్, దర్శకత్వం: వి.వి.వినాయక్.