న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: కరోనా విజృంభణ.. దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ ప్రమాదంలో పడేసింది. కొవిడ్-19 కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ర్టాలు లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో గతేడాది దేశవ్యాప్త లాక్డౌన్ నష్టాల నుంచి కోలుకుంటున్న భారత ఎకానమీకి.. ఇప్పుడు స్థానిక లాక్డౌన్లతో మరోసారి ఎదురుదెబ్బ తగిలినైట్లెంది. ఈ మహమ్మారిని అదుపు చేసేందుకు ఇప్పటికే కొన్ని రాష్ర్టాలు లాక్డౌన్ను ప్రకటించాయి. ఈ క్రమంలో వైరస్ నియంత్రణ సాధ్యం కాకపోతే పరిస్థితులు మరింత దిగజారే వీలుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ వృద్ధిరేటు ‘V’ ఆకారంలో పడిలేచిన కేరటంలా బలపడుతున్నదని సంబురపడుతున్న కేంద్రానికీ ఇది ఇబ్బందికరమని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
కీలక రంగాలపై ప్రభావం
దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ పరిణామం కీలక రంగాలను ప్రభావితం చేస్తున్నది. ఇప్పటికే పర్యాటక, ఆతిథ్య, రెస్టారెంట్, విమానయాన, వినోద, వాహన, నిర్మాణ రంగాలకు కరోనా సెగ తగులుతున్నది. దేశ జీడీపీలో వీటి వాటా ఎక్కువే. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2021-22) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో వృద్ధిరేటు తగ్గే వీలుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ నిరుడు కంటే కరోనా తీవ్రత అధికంగా ఉన్నట్లయితే దేశ ఆర్థిక వ్యవస్థకు మళ్లీ కష్టాలు తప్పవని అభిప్రాయపడుతున్నారు. చిరు వ్యాపారులపై ఇప్పటికే కొవిడ్ పంజా విసిరిందని గుర్తుచేస్తున్నారు.
తగ్గుతున్న జీడీపీ అంచనాలు
నిన్నమొన్నటిదాకా భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతున్నదని అంచనాలు వేసిన రేటింగ్ ఏజెన్సీలు.. నేడు దేశంలో కరోనా ఉద్ధృతిని చూసి తమ లెక్కలను సవరిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ అంచనాను నొమురా.. 13.5 శాతం నుంచి 12.6 శాతానికి దించింది. జేపీ మోర్గాన్ సైతం 13 శాతం నుంచి 11 శాతానికి పరిమితం చేసింది. యూబీఎస్ 10 శాతానికి సవరించింది. నిజానికి ఈ స్థాయి వృద్ధిరేటు తక్కువేం కాదు. అయితే అంచనాలు తిరుగుముఖం పడితే అవి మళ్లీ మైనస్లోకి జారుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్న నిపుణులు అంటున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా నెల రోజులు లాక్డౌన్ విధిస్తే భారత జీడీపీ వృద్ధిరేటు 2 పర్సెంటేజీ పాయింట్లు తగ్గుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇప్పటికే స్పష్టం చేసింది.
జూన్కల్లా సాధారణ పరిస్థితులు?
కరోనా సెకండ్ వేవ్.. వచ్చే నెలాఖరుకల్లా తగ్గుముఖం పడితే జూన్ చివరి నాటికి పరిస్థితులు సాధారణ స్థాయికి రావచ్చని యూబీఎస్ అంటున్నది. కాగా, గతేడాదితో పోల్చితే కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు వాటిల్లే నష్టం.. ఈసారి తక్కువేనని చెప్తున్నది. అయినప్పటికీ ఇప్పటికిప్పుడు భారత్ మాత్రం కరోనా సవాల్ను గట్టిగానే ఎదుర్కొంటున్నదని విశ్లేషించింది.
ప్రాణాలను, జీవనోపాధిని కాపాడుతాం..
ప్రాణాలను, జీవనోపాధిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం పనిచేస్తున్నదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో సోమవారం దేశ వ్యాపార, పారిశ్రామిక రంగాల ఆందోళనలపై ఆరా తీశారు. వివిధ ఇండస్ట్రీ చాంబర్స్ నుంచి ఆ వివరాలను సేకరించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావాన్ని తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలను టెలిఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. సీఐఐ, ఫిక్కీ, అసోచామ్ అధ్యక్షులతోపాటు టాటా స్టీల్, ఎల్అండ్టీ, టీసీఎస్, మారుతి, టీవీఎస్, హీరో సంస్థల చైర్మన్లు, ఎండీలతో ఆమె మాట్లాడారు.