Allari Naresh Movie | టాలీవుడ్లో సెన్సార్ నిబంధనలు చిత్రసీమ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. విడుదలకు ముందు వస్తున్న ఊహించని అభ్యంతరాలతో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’ సెన్సార్ అడ్డంకుల కారణంగా సెప్టెంబర్ 3న విడుదల కావడంపై సందిగ్ధత నెలకొంది. ఈ చిత్రంలోని రంభ, ఊర్వశి, మేనక పాత్రలు ధరించిన దుస్తులపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ పాత్రలను గ్లామరస్గా కాకుండా సాంప్రదాయ చీరలలో చూపించాలని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. సమస్య పరిష్కారం కాకపోతే మేకర్స్ రివైజింగ్ కమిటీని ఆశ్రయించాల్సి వస్తుంది.
ఇటీవల ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న చిత్రాలు ఇవే మొదటిసారి కావు. మైత్రీ మూవీ మేకర్స్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రావాల్సిన ‘ది 418’ చిత్రం జూలైలోనే విడుదల కావాల్సి ఉండగా, హారర్ మోతాదు ఎక్కువైందనే కారణంతో నిరవధికంగా వాయిదా పడింది. దీంతో చిత్ర బృందం ఇప్పటికే రివైజింగ్ కమిటీని సంప్రదించింది. అలాగే ‘కొరియన్ కనకరాజు’ సినిమా విషయంలోనూ కొన్ని సన్నివేశాలు ఇండియా-కొరియా సంబంధాలపై ప్రభావం చూపుతాయని బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, మేకర్స్ వారికి కథా నేపథ్యాన్ని వివరించి ఒప్పించవలసి వచ్చింది. వీటితో పాటు చివరి నిమిషంలో సినిమా పేర్లు మార్చాలనే నిబంధన కూడా నిర్మాతలకు పెను భారంగా మారుతోంది. ప్రచారం కోసం ఇప్పటికే పోస్టర్లు, ట్రైలర్లు, సోషల్ మీడియా క్రియేటివ్స్ వంటి పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత టైటిల్స్ మార్చమంటే తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని చిన్న, మధ్యతరహా బడ్జెట్ చిత్రాల నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.