Uppal Stadium | హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో మార్చి ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే టీ20 సెలబ్రిటీ క్రికెట్ లీగ్-2024 మ్యాచ్కు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి తెలిపారు. ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభమైన పదో ఎడిషన్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్-2024 పోటీలలో భాగంగా మార్చి 1వ తేదీ నుంచి ఉప్పల్లో జరుగనున్నాయని సీపీ తెలిపారు. ఇందులో భాగంగా బందోబస్తుపై డీసీపీలు, అదనపు డీసీపీలు తదితర సిబ్బందితో నెరెడ్మెట్లోని కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
వివిధ ఇండస్ట్రీలకు చెందిన సినిమా తారలు పాల్గొనే సెలబ్రిటీ క్రికెట్ పోటీలు కావడం వల్ల భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంటుందని, అందుకు తగ్గట్టుగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీపీ సూచనలు చేశారు. టిక్కెట్ల పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, సెలబ్రెటీ క్రికెట్ లీగ్ ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని, స్టేడియంలో కూల్ డ్రింక్స్, ఇతర ఆహార పదార్ధాల ధరలు నిబంధనల మేరకే ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీపీలు పద్మజ, కరుణాకర్, అరవింద్ బాబు, ఏసీపీలు శ్రీధర్రెడ్డి, పురుషోత్తంరెడ్డి, నరేష్రెడ్డి, నరేందర్గౌడ్, సెలబ్రెటీ క్రికెట్ లీగ్ ఫౌండర్ విష్ణు వర్ధన్ ఇందూరి తదితర అధికారులు పాల్గొన్నారు.