కొవిడ్ కట్టడికి వ్యాక్సినేషన్ విషయంలో ఎట్టకేలకు కేంద్రప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించింది. పద్దెనిమిదేండ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకా వేసే బాధ్యత తమదేనని, ఈ నెల 21నుంచి దేశవ్యాప్తంగా అమలవుతుందని కేంద్రం ప్రకటించటం ఊరట కలిగిస్తున్నది. రెండోదశ వైరస్ విజృంభణ తొలి రోజుల నుంచీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న టీకా విధానం అశాస్త్రీయంగా ఉన్నది. కరోనా పేట్రేగి అనేక మంది ప్రాణాలను బలిగొంటూ ఉంటే, కేంద్రం వ్యాక్సిన్ సేకరణ బాధ్యతను రాష్ర్టాలపై తోసివేసింది. ఇటువంటి విషమ పరిస్థితుల్లో విదేశాల నుంచి వ్యాక్సిన్లను సేకరించడం కేంద్ర ప్రభుత్వానికైనా అంత సులభం కాదు. అటువంటిది రాష్ర్టాలకు ఎలా సాధ్యపడుతుంది? ఈ సేకరణ ప్రక్రియలో కేంద్రం మాట సహాయం కూడా చేయడం లేదు. దీంతో దేశమంతా అయోమయం ఆవరించింది.
ఇప్పటికీ దేశంలో మొదటి డోసు టీకా తీసుకున్నవారు 25కోట్లకు మించలేదు. రెండో టీకా వేసుకున్నవారు ఆరుకోట్లే. మరోవైపు వైరస్ గ్రామాలలోకి కూడా విస్తరిస్తూనే ఉన్నది. కానీ కొవిడ్ మూడో దశ వ్యాప్తి ఉంటుందనే హెచ్చరికలు భీతిగొల్పుతున్నాయి. దేశంలో ఆందోళనకర పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పనితీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనాన్ని, అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ ఏడాదిలో జరిగే యూపీ ఎన్నికల అంశం కూడా కేంద్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసిందని అంటున్నారు. కారణాలు ఏమైతేనేమి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి వ్యాక్సిన్ పంపిణీపై స్పష్టమైన హామీ ఇచ్చింది. కానీ దేశంలో నెలకొన్న పరిస్థితిని గమనంలోకి తీసుకుంటే ఇప్పుడున్న వేగం, వ్యవస్థ ఏ మాత్రం సరిపోవు. వ్యాక్సిన్ ప్రక్రియ వేగం పుంజుకోవాలంటే ఉత్పత్తి, సరఫరాలు మెరుగుపడాలి. దేశంలో మరిన్ని సంస్థలకు వ్యాక్సిన్ తయారీ అనుమతులు ఇవ్వడమో, భారీగా దిగుమతులు చేసుకోవడమో జరగాలి. ఇందుకు కేంద్రం పటిష్టమైన వ్యూహాన్ని రచించుకోవాలి.
టీకా కోసం ‘కొవిన్’యాప్లో నమోదు తప్పనిసరి అని కేంద్రం నిబంధన పెట్టడం కూడా అభ్యంతరకరమే. ఈ నిబంధన వల్ల నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందిపడవచ్చు. గత డబ్భు ఏండ్లుగా దేశంలో సార్వత్రిక టీకా కార్యక్రమాలన్నీ కేంద్రీకృత విధానంతోనే విజయవంతమయ్యాయి. కేంద్రం సరఫరా బాధ్యత చేపడితే రాష్ర్టాలు సమర్థవంతంగా ఈ వ్యాక్సిన్ కార్యక్రమాలను అమలు చేశాయి. రాష్ట్రప్రభుత్వం ప్రజలకు చేరువగా వెళ్ళి ఈ బాధ్యతను నిర్వర్తించింది. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను కూడా అదే విధంగా నిర్వహించాలి. గ్రామీణ ప్రాంతాలకు టీకాలను చేర్చి అక్కడనే నమోదు చేసుకొని అందించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో, నిబద్ధతతో వ్యాక్సిన్ ప్రక్రియకు నడుం బిగించినప్పుడే కొవిడ్ కట్టడి జరుగుతుంది.