Mangli | తెలుగు రాష్ట్రాల్లో ఫోక్ సాంగ్స్తో విశేష గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ గాయని మంగ్లీ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. పెట్టుబడుల పేరుతో డబ్బులు సేకరించి మోసం చేయడం, అలాగే న్యాయవాదిని బెదిరించడం వంటి ఆరోపణలపై ఆమెపై కేసు నమోదవడం సంచలనంగా మారింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసు ప్రకారం, మంగ్లీ, ఆమె సోదరుడు శివ మరియు మరికొంత మంది కలిసి సుమారు 100 మంది నుంచి భారీ మొత్తంలో నిధులు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని నమ్మించి ఈ డబ్బులు తీసుకున్నట్లు బాధితులు తెలిపారు.
అయితే, కాలం గడుస్తున్నా ఎటువంటి లాభాలు ఇవ్వకపోవడం మాత్రమే కాకుండా, పెట్టుబడిగా ఇచ్చిన అసలు డబ్బును కూడా తిరిగి ఇవ్వలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో వారు ఆందోళన చెందుతూ న్యాయం కోసం న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో న్యాయవాది జోక్యం చేసుకోవడంతో వివాదం మరింత ముదిరింది. బాధితుల తరపున డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీయగా, మంగ్లీ మరియు ఆమె బృందం నుంచి బెదిరింపులు వచ్చాయని సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకా, ఈ కేసులో దర్శకుడు వేణు ఊడుగుల పేరు కూడా వెలుగులోకి రావడం గమనార్హం. మంగ్లీ, శివ, వేణు ఊడుగుల కలిసి ఫోన్ ద్వారా తీవ్రంగా బెదిరించారని, తనను యాక్సిడెంట్ చేయించి చంపేస్తామని హెచ్చరించారని న్యాయవాది ఆరోపించారు. ఈ నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ పోలీసుల వద్ద రక్షణ కోరారు.
ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి, మంగ్లీ, శివ, వేణు ఊడుగుల మరియు ఇతరులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.వరుస హిట్ పాటలతో కెరీర్లో దూసుకుపోతున్న మంగ్లీపై ఈ తరహా ఆరోపణలు రావడం సినీ, సంగీత రంగాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో నిజానిజాలు ఏవో దర్యాప్తులో తేలాల్సి ఉంది. కాగా, తన పాటలతో మంచి ఫేమ్ అందిపుచ్చుకున్న మంగ్లీ వివాదాలతో ఇమేజ్ బ్యాడ్ చేసుకుంటుంది.