‘ఇది క్రైమ్ అండ్ డిటెక్టివ్ థ్రిల్లర్. ఈ తరహా జానర్ చేయాలనకున్నప్పుడు ఏదో యూనిక్ నెస్ వుంటే తప్ప చేయకూడదని అనుకున్నాను. ‘భూతద్దం భాస్కర్నారాయణ’ కథ విన్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఇందులోని మైథాలజీ ఎలిమెంట్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇలాంటి ఎలిమెంట్ గతంలో వచ్చి ఏ డిటెక్టీవ్ సినిమాలో లేదు.’ అన్నారు శివ కందుకూరి. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘భూతద్దం భాస్కర్నారాయణ’. పురుషోత్తం రాజ్ దర్శకుడు. స్నేహల్, శశిధర్, కార్తీక్ నిర్మాతలు. నేడు ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా శివ కందుకూరి విలేకరులతో ముచ్చటించారు. ‘డిటెక్టివ్ సినిమా అనగానే చంటబ్బాయి, ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ చిత్రాలు గుర్తొస్తాయి.
ఈ సినిమా వాటికి భిన్నంగా ఉంటుంది. ఇళ్లముందు, పొలాల్లో దిష్టిబొమ్మలు మనం చూస్తుంటాం. అసలు వాటిని ఎందుకు పెడతారు? అనేదానిపై ఎవరికీ సరైన అవగాహన లేదు. దీనిపై పురాణాల్లో ఒక కథ వుంది. ఆ అంశాన్ని జోడించి కథను తయారు చేశాడు దర్శకుడు పురుషోత్తం రాజ్. ఆయనది అనంతపురం దగ్గర చిన్న పల్లెటూరు. ఆ ఊరు ప్రేరణగా తయారు చేసుకున్న కథ ఇది. కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల మధ్యవుండే ఫారెస్ట్ టౌన్ నేపథ్యంలో ఈ కథ జరుగుతుంది’ అని తెలిపారు. ఇందులో తన పేరు భాస్కర్నారాయణ అని, భూతద్దం సైజు కళ్లద్దాలు ఉంటాయని, దాంతో అందరూ భూతద్దం భాస్కర్నారాయణ అని పిలుస్తుంటారని, డిటెక్టివ్ కావడంతో ఆ కళ్లద్దాలు పెట్టుకొని భూతద్దం వాడుతుంటానని ఆయన తెలిపారు. సాంకేతికంగా అన్ని విధాలుగా సినిమా బావుంటుదని ఆయన అన్నారు.