ఉప్పెన సినిమా లాంటి మొదటి ప్రాజెక్టుతోనే బాక్సాపీస్ ను షేక్ చేశాడు బుచ్చిబాబు సాన (Buchi Babu) . ఈ యంగ్ డైరెక్టర్ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR)తో సినిమా చేయబోతున్నాడని ఇప్పటికే ఓ అప్డేట్ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ క్రేజీ కాంబినేషన్ పై ఓ ఆసక్తికర అప్డేట్ ఫిలింనగర్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన ఉండబోతుందట.
తాజా సమాచారం ప్రకారం అన్నీ కుదిరితే ఏప్రిల్ 11న ఈ సినిమాను ప్రకటించబోతున్నారని టాక్. ఎన్టీఆర్ తో జనతాగ్యారేజ్, బుచ్చిబాబుతో ఉప్పెన లాంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను తెరకెక్కించిన మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు సమాచారం. పీరియాడిక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కునున్న ఈ మూవీకి పెధి అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేశారట మేకర్స్. ఆసక్తికర విషయమేంటంటే తారక్ ఈ చిత్రంలో కబడ్డీ ప్లేయర్ గా నటించడం.
కెరీర్లో తొలిసారి కబడ్డీ ప్లేయర్ గా ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్నాడన్న అప్ డేట్ నందమూరి అభిమానుల్లో జోష్ నింపుతోంది. తారక్ నటించిన ఆర్ఆర్ఆర్ మార్చి 25న విడుదల కానుంది. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ఎన్టీఆర్. మరి బుచ్చి బాబు సినిమాను ఏ టైంలో సెట్స్ పైకి తీసుకెళ్తాడనేది చూడాలి.