డాక్టర్ పొన్నం రవిచంద్ర రచించిన ‘తెలంగాణ సినీ ప్రస్థానం’ పుస్తక పరిచయ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ రచయిత కె.వి.విజయేంద్రప్రసాద్, దర్శకులు వేణు ఊడుగుల, అల్లాణి శ్రీధర్, సినీ జర్నలిస్ట్ ప్రభు, రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత, సినీ విమర్శకులు మామిడి హరికృష్ణకు అంకితమిచ్చారు. పుస్తక రచయిత పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ ‘గతంలో నేను రాసిన 80 ఏళ్ల తెలుగు సినీ ప్రస్థానం పుస్తకానికి ఉమ్మడి రాష్ట్రంలో నంది పురస్కారం దక్కింది.
ఇప్పుడు ‘తెలంగాణ సినీ ప్రస్థానం’ పుస్తకాన్ని తీసుకురావడం ఆనందంగా ఉంది. పైడి జయరాజ్కు ముందు నుంచే చాలా మంది తెలంగాణ నటీనటులు, సాంకేతిక నిపుణులు సినీరంగంలో సత్తా చాటారు. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో చాలా మంది తెలంగాణ వారు ఉండటం విశేషం’ అన్నారు. ఈ పుస్తక రచనతో పొన్నం రవిచంద్ర గొప్ప ప్రయత్నం చేశారని కేవీ విజయేంద్రప్రసాద్ కొనియాడారు. తెలంగాణ సినిమా గురించి ఎంతో సమాచారాన్ని ఈ పుస్తకం ద్వారా తెలియజేశారని మామిడి హరికృష్ణ పేర్కొన్నారు.