ముంబై: బాలీవుడ్ వెటరన్ నటుడు దిలీప్ కుమార్ మరోసారి ఐసీయూలో అడ్మిట్ అయ్యారు. 98 ఏళ్ల ఈ లెజెండరీ నటుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుండటంతో ముంబైలోని హిందూజా హాస్పిటల్లో చేరారు. ఈ నెల మొదట్లోనే హాస్పిటల్లో చికిత్స పొందిన ఆయన.. తర్వాత డిశ్చార్జి అయ్యారు. అయితే రెండు వారాల వ్యవధిలోనే దిలీప్ను మరోసారి అడ్మిట్ చేయాల్సి వచ్చింది. మంగళవారమే హాస్పిటల్కు తీసుకెళ్లి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు పీటీఐ వెల్లడించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. ఆయన వయసును దృష్టిలో ఉంచుకొని కుటుంబ సభ్యులు ముందు జాగ్రత్తగా హాస్పిటల్కు తీసుకెళ్లినట్లు చెప్పింది.