ఫ్లాపుల బారి నుంచి బయటపడేందుకు నవ్వుల బాటను ఎంచుకున్నారు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. ఇకపై వరుసగా కామెడీ మూవీస్ చేయబోతున్నారు. ఆయనకు మంచి విజయాలను అందించిన ఎంటర్టైనర్స్ ‘హేరా ఫేరీ’, ‘ఆవారా పాగల్ దీవానా’, ‘వెల్ కమ్’ చిత్రాలకు సీక్వెల్ సినిమాలు చేయబోతున్నారు. ఈ చిత్రాల నిర్మాత ఫిరోజ్ నదియావాలతో అక్షయ్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లోనే ‘హేరా ఫేరీ 3’, ‘ఆవారా పాగల్ దీవానా 2’, ‘వెల్ కమ్ 3’ సినిమాలకు సంబంధించిన ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తున్నది.
ఈ సినిమాల సన్నాహాలపై నిర్మాత మాట్లాడుతూ…‘వినోదాత్మక సినిమాలకు అక్షయ్ మారుపేరు. ఆయన నటించిన కామెడీ ఎంటర్టైనర్స్ ప్రేక్షకులను నవ్వించి ఘన విజయాలు సాధించాయి. ‘హేరా ఫేరీ 3’, ‘ఆవారా పాగల్ దీవానా 2’, ‘వెల్ కమ్ 3’ సినిమాలు వరుసగా సెట్స్ మీదకు వెళ్తాయి. ఈ ప్రాజెక్ట్స్ సన్నాహాల కోసం అక్షయ్ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పర్చారు. మరోవైపు దర్శకుల ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతున్నది.’ అని అన్నారు. ఇవే కాకుండా అక్షయ్ విష్ లిస్ట్లో ‘ఛోటే మియా బడే మియా’, ‘జాలీ ఎల్ఎల్బీ 3’, ‘హౌస్ఫుల్ 5’ వంటి చిత్రాలున్నాయి.