బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన సైఫ్అలీఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలను అంగీకరిస్తున్నారు. తాజాగా ఆయన సైకలాజికల్ థ్రిల్లర్ కథకు ఓకే చెప్పారు. ‘క్లిక్ శంకర్’ పేరుతో తెరకెక్కించబోతున్న ఈ సినిమాకు తమిళ ‘మారి’ ఫేమ్ బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తారు. జంగిల్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మేలో సెట్స్మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో హైపర్ థైమీసియా అనే అరుదైన మానసిక రుగ్మతతో బాధపడే పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో సైఫ్అలీఖాన్ కనిపించనున్నారు.
తన జీవితంలో జరిగిన ప్రతీ సంఘటనను గుర్తుంచుకోవడం, గతం పదేపదే గుర్తుకు రావడం హైపర్ థైమీసియా రుగ్మత తాలూకు లక్షణాలు. సైఫ్అలీఖాన్ పాత్ర చుట్టూ పండే హాస్యం, కథలోని సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు కొత్త అనుభూతిని పంచుతాయని చిత్ర బృందం పేర్కొంది. ప్రస్తుతం సైఫ్అలీఖాన్ తెలుగులో ‘దేవర-1’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీనితో పాటు హిందీలో ఇన్వెస్టిగేటివ్ డ్రామా ‘కర్తవ్య’ సినిమాలో నటిస్తున్నారాయన.