ఆశ్చర్యకర ప్రకటన చేసి నెటిజన్లను షాక్కు గురిచేసింది బాలీవుడ్ నాయిక కాజోల్. ‘జీవితంలో ఒక కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నా’. అని పోస్ట్ చేసి సోషల్ మీడియా నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించింది. కాజోల్ జీవితంలో ఎదురైన ఆ సమస్య ఏంటి? ఆమె ఎందుకు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంది? అనేది సినీ ప్రియులను ఆలోచనలో పడేస్తున్నది. కాజోల్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తరుచూ తన భర్త అజయ్ దేవగణ్, కూతురు నైసా గురించి పోస్టులు చేస్తుంటుంది.
తన పాత సినిమాల వార్షికోత్సవాల సందర్భంగా ఆ చిత్రాల విశేషాలు తెలియజేస్తుంటుంది. ఇలా తరుచూ నెటిజన్లకు అందుబాటులో ఉండే కాజోల్ సామాజిక మాధ్యమాల నుంచి విరామం తీసుకోవడం చర్చనీయాంశంమైంది. ఈ నేపథ్యంలో ఆమెకు అభిమానులు ధైర్యం చెబుతున్నారు. మీరు ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలరు అంటూ కామెంట్స్ రాస్తున్నారు. ఇటీవల రేవతి దర్శకత్వం వహించిన ‘సలామ్ వెంకీ’ సినిమాలో కనిపించింది కాజోల్. ఆమె ప్రస్తుతం ‘లస్ట్ స్టోరీస్ 2’, ‘గుడ్ వైఫ్’ వంటి వెబ్ సిరీస్లు చేస్తున్నది.