బాలీవుడ్ హీరో సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో పలు విమర్శలను ఎదుర్కొంది ఆయన ప్రేయసి రియా చక్రవర్తి. డ్రగ్స్ సంబంధిత కేసులో ఆరు వారాల పాటు జైలు శిక్ష అనుభవించింది. దాదాపు మూడేళ్లుగా మీడియాకు దూరంగా ఉంటున్న ఆమె ఇటీవల ముంబయిలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైంది. ఈ మూడేళ్లలో తాను ఎంతో పరిణితి సాధించానని, తన వయస్సు 31 ఏండ్లయినా హృదయం మాత్రం ఎనభై ఏండ్ల వృద్ధురాలి అంతటి జ్ఞానాన్ని సంపాందించుకుందని వ్యాఖ్యానించింది.
‘జీవితానికి రెండో ఛాన్స్ ఉండదు కాబట్టి ఏం జరిగినా ముందుకు సాగిపోవాలి. సుశాంత్ మరణం నన్ను ఎంతగానో బాధించింది. అతన్ని జీవితమంతా మిస్ అవుతూనే ఉంటాను. నేను మామూలు మనిషిని కావడానికి చాలా సమయం పట్టింది. ఇక జైలులో అడుగుపెట్టిన తొలి రోజు నా జీవితం అగాధంలో కూరుకుపోయిందనే భావన కలిగింది. సహచర మహిళా ఖైదీలతో స్నేహం వల్ల క్రమంగా బాధ నుంచి కోలుకున్నా. బెయిల్ వచ్చిన తర్వాత వారిని విడిచి వెళ్తున్నందుకు కాస్త బాధగా ఫీలయ్యాను. జైలులో చివరి రోజు ఆ ఖైదీలతో కలిసి నాగిని డ్యాన్స్ చేశా. వాళ్లు ఎంతో ఆనందపడ్డారు. నా జీవితంలో మరచిపోలేని సందర్భమది’ అని రియా చక్రవర్తి పేర్కొంది.