బాలీవుడ్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ బ్రహ్మస్త్రం. రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రల్లో నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకుడు. కరణ్ జోహార్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఈ నెల 9న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. దర్శకుడు రాజమౌళి చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం ప్రచార కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు. హీరో ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ…ఈ సినిమా విడుదల కోసం వేచి చూస్తున్నాను. మూవీ అద్భుతంగా వచ్చింది. ఒక విజువల్ వండర్ గా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ….కొత్తగా, విభిన్నంగా సినిమాలు చేయాలనే ఒత్తిడిలో ప్రస్తుతం సినిమా పరిశ్రమ ఉంది. ఆ ఒత్తిడి నుంచే గొప్ప సినిమాలు రూపొందించాలనే ప్రయత్నాలు మొదలవుతాయని భావిస్తున్నా. ఈ క్రమంలో బ్రహ్మాస్త్రం భారతీయ చిత్ర పరిశ్రమకు గొప్ప విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నా. ఈ సినిమాలో నేను అభిమానించే అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, నాగార్జున..లాంటి వాళ్లంతా నటించడం సంతోషంగా ఉంది. కరణ్ జోహార్, రాజమౌళి కలిసి ఒక సినిమాకు పనిచేయడం భారతీయ సినిమా ఒక్కటే అని నిరూపిస్తున్నది.
ఈ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమానికి వినాయక నిమజ్జనాల దష్ట్యా పోలీసు పర్మిషన్ ఇవ్వలేదు. మన మంచి కోసమే పనిచేసే పోలీసులకు ఒక పౌరుడిగా సహకరిస్తాను. అన్నారు. దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ…ఐదేళ్ల కిందట ఈ కథ విన్నాను. ఒక ప్రతిష్టాత్మక సినిమా అవుతుందని అనిపించింది. మన పురాణాలు, ఇతిహాసాల నేపథ్యంతో మలచిన సూపర్ హీరో చిత్రమిది. ఇందులో నంది అస్త్రం, బ్రహ్మాస్త్రం ఇలా ఎన్నో అస్త్రాలుంటాయి. ఆ అస్త్రాలను ప్రయోగించే శక్తిగల పాత్రలుంటాయి.
ఈ సినిమాకు దక్షిణాది భాషల్లో సమర్పకులుగా వ్యవహరిస్తున్నందుకు గర్వంగా ఉంది. అన్నారు. కరణ్ జోహార్ మాట్లాడుతూ….ఇన్నాళ్లు మనమంతా బాలీవుడ్, టాలీవుడ్ అని మాట్లాడుతున్నాం. ఇకపై వాటన్నింటినుంచీ బయటకొచ్చి ఇండియన్ సినిమా అని పిలుచుకోవాలి. భారతీయ సినిమాలన్నీ ఒక్కటే. దర్శకుడు అయాన్ ముఖర్జీ పదేళ్ల కల ఈ సినిమా. అతను ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పనిచేశాడు. నాగార్జున మా టీవ్ు లో చేరగానే అందరిలో ఒక ఉత్సాహం వచ్చింది. అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలియా భట్, రణ బీర్ కపూర్, మౌనీ రాయ్ తదితరులు పాల్గొన్నారు.