Kriti Sanon | డీప్ ఫేక్.. ఈ టెక్నాలజీ ఇప్పుడు ఎంతోమందిని కలవరపెడుతుంది. ఈ టెక్నాలజీ బారినపడి రష్మిక మందన, ఆలియా భట్, కత్రినాకైఫ్, సచిన్ టెండూల్కర్.. ఇలా చాలామంది సెలబ్రెటీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రష్మిక మందన్న అయితే ఒకడుగు ముందుకేసి.. దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది. తనలా డీప్ ఫేక్ కష్టాలు ఎదుర్కొంటున్న వారు గళం విప్పేందుకు ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఇలా అందరూ డీప్ ఫేక్లపై ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ మాత్రం టెక్నాలజీకి సపోర్ట్గా వ్యాఖ్యలు చేసి అందరికీ షాకిచ్చింది.
షాహిద్ కపూర్తో కలిసి కృతి సనన్ నటించిన తేరీ బాతో మై ఐసా ఉల్జా జియా అనే చిత్రం ఫిబ్రవరి 9వ తేదీన విడుదల కాబోతుంది. ఇందులో హ్యుమనాయిడ్ రోబోగా కృతి సనన్ నటించింది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతిసనన్కు డీప్ ఫేక్ టెక్నాలజీపై ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో డీప్ఫేక్ టెక్నాలజీపై తన మనసులోని మాటను కృతి సనన్ బయటపెట్టింది. కొద్ది నెలలుగా సెలబ్రెటీల మార్ఫింగ్ వీడియోలు సంచలనం సృష్టిస్తున్నాయని తెలిపింది. అదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వార్తలు చదివే యాంకర్ను కూడా చూశామని పేర్కొంది. అంటే మనం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లే అని తెలిపింది. కాబట్టి డీప్ ఫేక్ వీడియోల విషయంలో టెక్నాలజీని నిందించడం తప్పు అని తన అభిప్రాయాన్ని చెప్పింది. ఈ టెక్నాలజీతో ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయని పేర్కొంది. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ ) మన భాగస్వామి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది.
అయితే టెక్నాలజీపై కృతి సనన్ చెప్పిన అభిప్రాయంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సహచర హీరోయిన్లు, ప్రముఖుల వీడియోలు మార్ఫింగ్ చేస్తుంటే.. ఆ టెక్నాలజీకి సపోర్ట్ ఇవ్వడం ఏంటని సీరియస్ అవుతున్నారు. డీప్ఫేక్ కారణంగా మహిళలకు భద్రత లేకుండా పోతుందని.. ఇలాంటి టెక్నాలజీని కట్టడి చేయాల్సిన అవసరం ఉందటూ కామెంట్లు పెడుతున్నారు.