Dia Mirza | బాలీవుడ్ నటి దియా మీర్జా ప్రకృతి ప్రేమికురాలు. పర్యావరణ పరిరక్షణకు తనవంతుగా పాటుపడుతూ ఉంటుంది. ఇటీవల నైరోబీలో జరిగిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సుకు ఆమె హాజరైంది. ‘ఈ సదస్సులో పేరెన్నికగన్న పర్యావరణవేత్తలను కలుసుకునే అవకాశం వచ్చింది. మనిషి చేస్తున్న తప్పిదాలు పర్యావరణానికి ఎంత హాని తలపెడుతున్నాయో అర్థమైంది. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా 2032 కల్లా ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ మొక్కలు నాటాలన్న ఆ సదస్సు నిర్ణయం కొంత ఊరటనిచ్చింది.
ఎన్ని మొక్కలు నాటినా.. మనలో మార్పు రానంత వరకు ప్రకృతికి ప్రమాదం తప్పనట్టే! మా అబ్బాయి చదివే క్లాసులో దాదాపు 90 శాతం మంది పిల్లలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్నారు. పర్యావరణ కాలుష్యమే ఇందుకు కారణం. మన అవసరాల కోసం భవిష్యత్ తరాల బతుకును పణంగా పెడుతున్నాం. ముందుతరాలు మనల్ని తిట్టుకోవద్దంటే.. ఇప్పటికైనా మేల్కోవాలి. పర్యావరణాన్ని పరిరక్షించేలా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో వాటిని పక్కాగా అమలు చేయాలి. కాలుష్యాన్ని నియంత్రించాలి. ప్రకృతి వనరులను ధ్వంసం చేసేవారిని కఠినంగా శిక్షించాలి. అప్పుడే ప్రకృతి పదిలంగా ఉంటుంది. ముందు తరాల మనుగడ సాధ్యమవుతుంది’ అని పేర్కొన్నది దియా.