పారితోషికాల విషయంలో హీరోలతో పోటీపడుతూ తగ్గేదేలే అంటున్నారు అగ్ర కథానాయికలు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ కూడా రెండుమూడు కోట్లకు మించేది కాదు. కానీ ఇప్పుడు సినీ వ్యాపార సమీకరణాలు మారిపోయాయి. పాన్ ఇండియా ట్రెండ్తో పాటు నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు ఆదరణ పెరగడంతో హీరోయిన్స్ సైతం భారీ పారితోషికాలను డిమాండ్ చేస్తున్నారు. దక్షిణాదితో పాటు హిందీలో అగ్ర కథానాయికలు పదికోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకోవడం సాధారణంగా మారింది. అయితే బాలీవుడ్ భామ అలియాభట్ అతిథి పాత్రకోసమే 15కోట్ల రెమ్యునరేషన్ స్వీకరించి ఇప్పుడు హాట్టాపిక్గా మారింది.
హిందీ సూపర్హిట్ హారర్ ఫిల్మ్ ‘తుంబాడ్’కు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సోహమ్షా హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్ బావ్రే దర్శకుడు. ఇందులో అలియా కీలకమైన అతిథి పాత్రను పోషిస్తున్నది. కేవలం పదినిమిషాల నిడివిగల ఈ పాత్ర కోసం మేకర్స్ అలియాభట్కు 15 కోట్ల రెమ్యునరేషన్ను ఆఫర్ చేశారని తెలిసింది. పాన్ ఇండియా స్థాయిలో అలియాభట్కు ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని ఆమె కోరినంత పారితోషికాన్ని ఇచ్చారని బాలీవుడ్ ట్రేడ్వర్గాల్లో వినిపిస్తున్నది. త్వరలో ఈ సినిమా సెట్స్లో అలియాభట్ జాయిన్ కానుంది. ఈ సీక్వెల్లో నవాజుద్దీన్ సిద్ధికీ సైతం ఓ హీరోగా నటిస్తున్నారు. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురానుంది.